Reliance | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ఐటీమంత్రి కేటీఆర్ చెప్పినట్టే జరుగుతున్నది. దేశంలోని సామాన్యుడి ఆర్థిక కష్టాలకంటే కార్పొరేట్ల ప్రయోజనాలే కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఎక్కువని మరోసారి రుజువైంది. రష్యా నుంచి చౌక ధరకే ముడిచమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకొంటున్న కేంద్రం.. ఆ చమురును ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలను కాదని ప్రైవేట్ రిఫైనరీలకు నామమాత్రపు ధరకు ఇస్తున్నది. ఈ ముడిచమురును శుద్ధిచేసిన ప్రైవేట్ కంపెనీలు పశ్చిమ దేశాలకు ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నాయి. ఇలా.. అంతర్జాతీయ మార్కెట్లో, రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు లభిస్తున్నప్పటికీ, ఆ ప్రయోజనం సామాన్యులకు దక్కకుండా కార్పొరేట్లకు దారిమళ్లుతున్నది.
ఏడాదిగా ఇదే తంతు..
ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగిన రష్యా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న చమురును ఆ దేశం నుంచి ఎవరూ దిగుమతి చేసుకోవద్దంటూ నిషేధం విధించాయి. అయితే, దౌత్య సంబంధాల కారణాలను చూపించిన కేంద్రం.. రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేస్తూ వస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా 24 రెట్లు ఎక్కువ మొత్తంలో చమురు దిగుమతులను పెంచుకొన్నది. అంతేకాకుండా.. ఇతర దేశాల నుంచి డిమాండ్ లేకపోవడంతో భారత్ పెట్టిన నిబంధనలకు తప్పనిసరి పరిస్థితుల్లో తలొగ్గిన రష్యా.. చౌక ధరకే క్రూడాయిల్ విక్రయిస్తున్నది. ఇది తమ దౌత్య విజయంగా బీజేపీ పరీవారం ప్రచారం చేసుకొన్నది. అయితే, రష్యా నుంచి ఏడాది కాలంగా తక్కువ ధరకే ముడి చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకొంటున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గలేదు. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. దీనిపై బీజేపీ సర్కారు నుంచి ఏ మాత్రం సమాధానంలేదు. రష్యా నుంచి చేకూరిన చమురు ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తమ కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టడమే దీనికి కారణంగా తెలుస్తున్నది.
రెండు కంపెనీలకు..
రష్యా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన క్రూడాయిల్ను నామ మాత్రపు ధరకు రిలయన్స్ ఎనర్జీ, నయారా ఎనర్జీకు (గతంలో ఎస్సార్ గ్రూప్) కేంద్రం కట్టబెడుతున్నట్టు సమాచారం. రష్యా నుంచి దిగుమతి అయ్యే మొత్తం ముడి చమురులో 50 శాతానికిపైగా చమురు ఈ రెండు కంపెనీలకే సరఫరా చేస్తున్నట్టు తెలుస్తున్నది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ చమురును ఎక్కువ ధరకు అమెరికా, ఐరోపా దేశాలకు ఈ ప్రైవేట్ కంపెనీలు ఎగుమతి చేసి వేల కోట్లు గడిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలైన ఐవోసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ అతి తక్కువ శాతం రష్యా ముడి చమురును కేటాయిస్తూ మోదీ సర్కారు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ వినియోగం పేరిట రష్యా నుంచి కేంద్రం భారీగా ముడి చమురును దిగుమతి చేసుకొంటున్నది. దాన్ని శుద్ధిచేసి తిరిగి విదేశాలకు ఎక్కువ రేటుకు అమ్ముకొంటున్నది. ముడి చమురు దిగుమతులతో రష్యా నుంచి చేకూరిన రూ. 35 వేల కోట్ల పొదుపు ప్రయోజనం సామాన్యులకు దక్కకుండా ఓ రెండు ఆయిల్
కంపెనీలకు చేరింది.
– గత నెల 30న కేంద్రానికి రాసిన బహిరంగ లేఖలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్
అటు కొని.. ఇటు విక్రయిస్తున్నది
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను పెద్దెత్తున పెంచుకోవడం పశ్చిమ దేశాలకు ఇబ్బందిగా ఏమీలేదు. రష్యా నుంచి ముడి చమురును చౌకగా కొంటున్న భారత్.. దాన్ని పశ్చిమ దేశాలకు విక్రయిస్తున్నది. దీంతో చమురు కొరత ఎక్కడా కనిపించట్లేదు.
-స్పెన్సర్ డేల్, బీపీ చీఫ్ ఎకానమిస్ట్
సంవత్సరం బ్యారెల్ ముడి చమురు ధర పెట్రోల్ రేటు (లీటర్కు)
2013 110 డాలర్లు రూ. 76
2023 65 డాలర్లు రూ. 109
రష్యా నుంచి భారత్ రోజుకు దిగుమతి చేసుకొనే ముడిచమురు
36 వేల బ్యారెళ్లు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు
గత నెలలో రోజుకు సగటున
9.10 లక్షల బ్యారెళ్లు
పెరుగుదల 2400%
రోజుకు 54 లక్షల బ్యారెళ్లు
భారత్కు అవసరమయ్యే ముడిచమురు
పశ్చిమ దేశాలకు చమురు ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల 22%