ముంబై, మార్చి 21: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ లభించనున్నది. ప్రస్తుత సంవత్సరంలో సరాసరి ఉద్యోగుల వేతనాలు 10.2 శాతం పెరగనున్నాయని ఓ సర్వే వెల్లడించింది. ఈ-కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఐటీ రంగంలో వేతన పెంపు అధికంగా ఉండనున్నదని ఈవై విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ పే 2023’ నివేదికలో వెల్లడించింది. 2022 లో పెరిగిన 10.4 శాతం కంటే ఇది తక్కువ. ఈ-కామర్స్ రంగ ఉద్యోగుల వేతనాల్లో 12.5 శాతం పెరగనుండగా, ప్రొఫెషనల్ సర్వీసెస్లో 11.9 శాతం, ఐటీ రంగం లో 10.8 శాతం అధికంకానున్నాయని పేర్కొం ది.
డిసెంబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు దేశవ్యాప్తంగా 150కి పైగా కంపెనీ ఉన్నత ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈవై ఈ నివేదికను విడుదల చేసింది. భారత్లో ప్రతిభ కలిగిన వారికి కొదవ లేకపోయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, టెక్నాలాజికల్ అడ్వాన్స్మెంట్స్ పరిస్థితులకు అనుగుణంగా వేతన పెంపు ఆధారపడివున్నదని పేర్కొంది. ఈ ఏడాదిలో రెన్యూవబుల్ ఎనర్జీ, ఈ-కామర్స్, డిజిటల్ సర్వీసు, హెల్త్కేర్, టెలి కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషనల్, రిటైల్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగ కల్పన జోరందుకోనున్నదని పేర్కొంది.