Stocks ‘Fri’Day | సౌతాఫ్రికాతోపాటు పలు దేశాల్లో కొత్త కరోనా వేరియంట్ బయటపడిందని వైద్యులు నిర్ధారించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నెత్తురోడాయి. కరోనా న్యూ వేరియంట్ రాకతో మళ్లీ ఆంక్షలు అమలులోకి వస్తాయేమోనన్న సంకేతాల మధ్య బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ భారీగా క్రష్ అయింది. శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.7.36 లక్షల కోట్ల సొమ్ము కోల్పోయారు. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 1687.94 (2.87 శాతం) పాయింట్లు నష్టపోయి..57,107.15 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇక బ్రాడర్ ఎక్స్చేంజ్.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 509.80 పాయింట్లు (2.91%) కోల్పోయి 17,026.45 పాయింట్ల వద్ద నిలిచింది.
కరోనా న్యూ వేరియంట్ నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్లో ఫార్మా షేర్లు దూసుకెళ్లాయి. మెటల్ స్టాక్ పతనం అయ్యాయి. టార్సన్స్ ప్రొడక్ట్స్ లిస్టింగ్ తర్వాత 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. జేపీ మోర్గాన్ క్రెడిట్ పరపతి తగ్గించడంతో టాటా పవర్ 7 శాతం నష్టపోయింది. న్యూ వేరియంట్ కనుగొన్నామని సౌత్ ఆఫ్రికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే సౌత్ ఆఫ్రికా, బొత్స్వానా, హాంకాంగ్ దేశాల నుంచి వచ్చే వారు నిరంతరం స్క్రీన్ టెస్టులు చేయించుకోవాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
యూరోపియన్ యూనియన్ దేశాలు కరోనా బూస్టర్ డోస్ వేగవంతం చేయడంతోపాటు రాత్రివేళ ఆంక్షలు పటిష్టం చేశాయి. ఇప్పటికే స్లావేకియా రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది. జర్మనీలో కరోనా మృతులు లక్ష దాటడంతో ఆ దేశ సరిహద్దులను మూసివేస్తామని తెలిపింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,300.65 కోట్ల విలువైన షేర్లను విక్రయించేశారు. ఇక పదేండ్ల విలువ గల బాండ్ల విలువ 6 బేసిక్ పాయింట్ల నుంచి సుమారు1.5841 శాతానికి పడిపోయింది. ఐదు స్టాక్స్ మాత్రం 54 శాతం నష్టపోతాయని జెఫరీస్ ఇండియా స్టాక్ అనలిస్టులు పేర్కొంటున్నారు.
కరోనా కేసులు పెరుగుతాయన్న అంచనాల మధ్య బ్లూచిప్ కంపెనీల్లో ఒకటైన సిప్లా భారీగా లబ్ధి పొందింది. సిప్లా స్క్రిప్ట్ 7.23 శాతం లాభపడగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివిస్ ల్యాబ్స్, నెస్ట్లె ఇండియా స్క్రిప్ట్లు భారీగా లబ్ధి పొందాయి. ఇక నిఫ్టీలో జేఎస్డబ్ల్యూ స్టీల్ భారీగా 7.48 శాతం నష్టపోయింది. టాటా మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, మారుతి సుజుకి, టాటా స్టీల్ తదితర స్టాక్స్ పతనం అయ్యాయి.
మిడిల్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ట్రిడెంట్, అల్కేం ల్యాబోరేటరీస్, డాక్టర్ లాల్ పాథ్ల్యాబ్స్, ఫైజర్ స్క్రిప్ట్ 4-7 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు నేషనల్ అల్యూమినియం కంపెనీ, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, డెల్టా కార్ప్స్, ఆర్బీఎల్ బ్యాంక్, చంబల్ ఫర్టిలైజర్స్, స్పైజ్ జెట్ షేర్లు 7-10 శాతం మధ్య నష్టపోయాయి.
నిఫ్టీ ఫార్మా 1.7 శాతం మినహా అన్ని సెక్టార్ల ఇండెక్స్ల్లో నష్టాలు నమోదయ్యాయి. నిఫ్టీ రియాల్టీ భారీగా 6.26 శాతం నష్టపోయింది. నిఫ్టీ మెటల్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఆటో ఇండెక్స్లు భారీగా పతనం అయ్యాయి. 1067 స్టాక్స్ లాభ పడగా, 2,244 స్క్రిప్ట్లు నష్టపోయాయి. ఇక 237 సెక్యూరిటీలు (స్మాల్ క్యాప్) 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. 34 బాండ్లు (మైక్రోక్యాప్) 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. ఇక యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. లండన్ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్టీఎస్ఈ 2.66, పారిస్ 3.18, ఫ్రాంక్ఫర్ట్ 2.55 శాతం నష్టపోయాయి. ఆసియా దేశాల్లోనే అన్ని మార్కెట్లు పతనంతోనే ముగిశాయి.