న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో గత ఏడాది అమెజాన్, ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేశాయి. వ్యయ నియంత్రణ, ఉద్యోగ బృందాల పునర్వ్యవస్ధీకరణ పేరుతో ఎడాపెడా సిబ్బందిని తొలగించాయి. ఇక 2023లోనూ లేఆఫ్స్ పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేకపోవడం టెకీల్లో గుబులు రేపుతోంది.
ఆర్ధిక మాంద్యం భయాలు వీడకపోవడం, కంపెనీల రెవెన్యూ పడిపోతుండటంతో ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డ కంపెనీలు ముందుగా కొలువుల కోతకు తెగబడుతున్నాయి. దీంతో గత ఏడాది చివరిలో టెక్ ప్రపంచాన్ని వణికించిన మాస్ లేఆఫ్స్ కొత్త ఏడాది ఆరంభంలోనూ కొనసాగుతున్నాయి. స్టార్టప్ లేఆఫ్స్ను ట్రాక్ చేసే లేఆఫ్స్.ఎఫ్వైఐ సైట్ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 91 టెక్ కంపెనీలు జనవరి 2023లో ఇప్పటివరకూ 24,151 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయని వెల్లడైంది.
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించగా లేఆఫ్స్ కొనసాగుతాయని కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ నిర్ధారించారు. సిస్కో ఇప్పటికే 700 మంది ఉద్యోగులను సాగనంపింది. క్లౌడ్ బేస్డ్ టెక్ కంపెనీ సేల్స్ఫోర్స్ తమ సిబ్బందిలో పది శాతం మందిపై వేటు వేయనున్నట్టు ప్రకటించింది. క్రిఫ్టోకరెన్సీ కంపెనీ కాయిన్బేస్ 950 మందిని తొలగించింది. ఇక భారత్కు చెందిన ఓలా, డుంజో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో వందలాది ఉద్యోగులను సాగనంపాయి. షేర్చాట్, క్రిఫ్టో.కాం, వొడాఫోన్ వంటి పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.