Investments | గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ మార్కెట్గా భారత్ మారుతోంది. ఈ నెలలో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 76 శాతం మనదేశంలోకే వచ్చేస్తున్నాయి. ఆసియా ఖండంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెడితే, భారత్లోకి రూ.45.5 వేల కోట్లు వచ్చేశాయి. తర్వాతీ స్థానంలో దక్షిణ కొరియా నిలిచింది.
ఆసియా ఖండంలోని తొమ్మిది అగ్రశ్రేణి దేశాల్లో ఈ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) సుమారు రూ.59,876 కోట్లు (7.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. బ్లూంబర్గ్ డేటా ప్రకారం భారత్లోకి గరిష్టంగా రూ.45,506 కోట్ల (5.7 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న దక్షిణ కొరియాలో ఎఫ్పీఐలు సుమారు 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు మదుపు చేశారు.
చైనా మినహా విదేశీ ఇన్వెస్టర్లు ఆసియన్ మార్కెట్ల పట్ల ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆసియా మార్కెట్లలోకి ప్రత్యేకించి భారత్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు భారత్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.2.60 లక్షల కోట్లు (33 బిలియన్ డాలర్లు) విలువ చేసే స్టాక్స్ విక్రయించారు. భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న సంకేతాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు నిధులు తీసుకొస్తున్నారు.