దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో తెలంగాణకు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సదస్సుకు హాజరైన తెలంగాణ బృందంతో అనేక ప్రముఖ దేశ, విదేశీ సంస్థలు సమావేశమవుతున్నాయి.
ఈ క్రమంలోనే భారతీయ ప్రధాన బ్యాటరీ మెటీరియల్స్ తయారీదారుల్లో ఒకటైన అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో కార్బన్ కోటెడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (సీ-ఎల్ఎఫ్పీ) క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ యూనిట్ను పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇది దేశంలోనే తొలి కేంద్రం కావడం విశేషం.
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నది. ఇది దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యూనిట్ను నెలకొల్పుతున్నది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ యాక్టివ్ బ్యాటరీలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలుత రూ.210 కోట్ల పెట్టుబడితో 3 గిగావాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని అలాక్స్ తెలిపింది. ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో 10 గిగావాట్లకు పెంచుతామన్నది. 2030 నాటికి మొత్తంగా రూ.750 కోట్లను ఈ కేంద్రంపై పెట్టుబడిగా పెట్టనున్నట్టు అలాక్స్ స్పష్టం చేసింది. ఇక ప్రతిపాదిత ఈ తయారీ కేంద్రంతో సుమారు 600 మంది హైలీ స్కిల్డ్, సెమీ-స్కిల్డ్ ప్రొఫెషనల్స్కు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అలాక్స్ ఈ సందర్భంగా తెలియజేసింది.
అందుకే తెలంగాలో..: అలాక్స్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణమేనని అలాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సుంకవల్లి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంతోపాటు ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో కీలకంగా మారేందుకు తమ సంస్థ ప్రయత్నిస్తోందని చెప్పారు. ముఖ్యంగా యాక్టివ్ క్యాథోడ్ మెటీరియల్స్ను సరఫరా చేయడం ద్వారా తమ కంపెనీ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరిస్తామని మౌర్య సుంకవల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఈవీ సెక్టార్ డైరెక్టర్ ఆటోమోటివ్ గోపాలకృష్ణన్ పాల్గొన్నారు.
తయారీలో తెలంగాణ హవా
తెలంగాణలో లిథియం బ్యాటరీల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అలాక్స్ ముందుకు రావడం సంతోషకరం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు రాష్ట్రంలో తయారీ ఈకో సిస్టంను పెంచేందుకు మా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ-అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ కీలకంగా మారబోతున్నది. 2020లోనే తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్, ఈఎస్ఎస్ పాలసీని తీసుకొచ్చింది. ఇలాంటి ప్రత్యేక పాలసీని దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ప్రభుత్వం మాదే. – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు