ముంబై: అక్టోబర్ 19:డాలర్ దెబ్బకు రూపాయి విలవిలలాడుతున్నది. ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో లోతుల్ని చవిచూసిన మారకం విలువ బుధవారం చారిత్రక కనిష్ఠ స్థాయి 83కు పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రుపీ అల్లాడిపోయింది. నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు కరెన్సీ విలువ 42 శాతం వరకు దిగజారింది. 2014 మే నెలలో 58.4 రూపాయ లుగా ఉన్న విలువ ప్రస్తుతం 83.03 స్థాయికి పడిపోయింది. పలు ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే భారత కరెన్సీ అత్యధికంగా పతనం కావడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు 11.75 శాతం దేశీయ కరెన్సీ విలువ జారుకున్నది. 2013 తర్వాత ఒకే ఏడాదిలో ఇంత నష్టపోవడం ఇదే తొలిసారి.
మరింత దిగజారిన కరెన్సీ విలువ.. ఒకేరోజు 60 పైసలు తగ్గి 83 స్థాయికి డాలర్ దెబ్బకు రూపాయి కకావికలమైంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే..మరోవైపు ప్రపంచ కరెన్సీ మార్కెట్లో డాలర్ అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న అగ్రరాజ్యం అమెరికా కరెన్సీతో ఇతర కరెన్సీలు బక్కచిక్కిపోయాయి. దేశీయ కరెన్సీ అయితే పాతాళంలోకి జారుకున్నది. చారిత్రక కనిష్ఠ స్థాయి 83కి తాకింది. భవిష్యత్తులో ఏ స్థాయికి పడిపోతుందేమోనన్న భయాలు ఫారెక్స్ డీలర్లు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో లోతుల్ని చూసిన రూపాయి తాజాగా మరింత పాతాళానికి పడిపోయింది. చరిత్రలో తొలిసారిగా 83 స్థాయికి దిగజారి కొత్త రికార్డు కనిష్ఠాన్ని చూసింది. బుధవారం నాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 83 దిగువకు దిగజారింది. 83.02 స్థాయికి తగ్గి, చివరకు 83 వద్ద ముగిసింది. ఒకే రోజున 60 పైసల నష్టాన్ని చవిచూసింది. క్రితం రోజున ఇది 82.40 వద్ద నిలిచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి ఇప్పటివరకూ 11.75 శాతం క్షీణించింది. గత రెండు, మూడు ట్రేడింగ్ సెషన్లలో 82.40 స్థాయి దిగువకు తగ్గకుండా రిజర్వ్బ్యాంక్ డాలర్లను విక్రయిస్తూ ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి మద్దతుగా నిలిచిందని, ఇప్పుడీ స్థాయి నుంచి ఆర్బీఐ తప్పుకోవడంతో నిట్టనిలువునా పతనమయ్యిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. ‘ఆర్బీఐ జోక్యం చేసుకోవడం లేదన్న విషయం తెలిసిన క్షణం నుంచి మార్కెట్లో డాలర్ల కోసం పరుగులు తీసారని, దాంతో రూపాయి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యిందని ట్రేడర్లు వివరించారు. రిజర్వ్బ్యాంక్ తిరిగి మార్కెట్లోకి ప్రవేశించకపోతే ఏ స్థాయికైనా రూపాయి పడిపోవొచ్చన్న భయాలను ఒక ప్రైవేట్ బ్యాంక్కు చెందిన ఫారెక్స్ ట్రేడర్ వ్యక్తం చేశారు. ‘కొద్ది రోజులుగా 82.40 స్థాయి సమీపంలో రూపాయికి రక్షణగా ఆర్బీఐ నిలబడుతున్నది. ఈ రోజు ఆర్బీఐ మార్కెట్ నుంచి తప్పుకున్నట్టు కన్పిస్తున్నది. దీంతో డాలర్-రూపాయి పెయిర్లో 83-83.20 శ్రేణి వరకూ కొనుగోళ్లు జరిగాయి’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ కరెన్సీ అనలిస్ట్ జిగర్ త్రివేది తెలిపారు.
డాలర్ బలోపేతం
బ్రిటన్లో ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠం 10.1 శాతానికి చేరడం, వడ్డీ రేట్లను పెంచుతూనేపోతామంటూ అమెరికా ఫెడ్ అధికారి ఒకరు చేసిన ప్రకటనతో డాలర్ ఇండెక్స్ ఏకంగా 0.7 శాతం ఎగిసి 112.80 స్థాయికి చేరింది. ఫెడ్ వ్యాఖ్యలతో అమెరికా బాండ్ ఈల్డ్స్తో పాటు యూరప్ దేశాలు, భారత్ బాండ్ ఈల్డ్స్ సైతం పెరగడం కూడా రూపాయిని దెబ్బతీసింది. వడ్డీ రేట్ల పెరుగుదల అంచనాలతో భారత్ ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 7.39 స్థాయి నుంచి 7.45 స్థాయికి చేరాయి. డాలర్ ఇండెక్స్లో వెయిటేజి ఎక్కువగా ఉన్న బ్రిటన్ పౌండ్, యూరో, జపాన్ యెన్ల మారకంలో డాలర్ 0.4 శాతం వరకూ బలపడింది. దీంతో ఇండెక్స్ పెరిగింది. ఫలితంగా భారత్ రూపాయి 0.9 శాతం, చైనా యువాన్ 0.65 శాతం, బ్రెజిల్ రియాల్ 0.81 శాతం, దక్షిణాఫ్రికా రాండ్ 0.75 శాతం చొప్పున తగ్గాయి.
ద్రవ్యోల్బణం భయాలు
సెప్టెంబర్ నెలలో 7.4 శాతానికి చేరిన దేశీ రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని, ఈ కారణంగా రిజర్వ్బ్యాంక్ వచ్చే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను అధికశాతం పెంచుతుందన్న భయాలు మార్కెట్లో నెలకొన్నాయి. ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధర పెంచినందున ద్రవ్యోల్బణం అధికమవుతుందని డీబీఎస్ బ్యాంక్ ఎకానమిస్ట్ రాధికారావు చెప్పారు. దేశీ ద్రవ్యోల్బణం ఆందోళనలతో పాటు అంతర్జాతీయ అనిశ్చితితో రిస్క్లు దేశంలోకి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్నదన్నారు. ఈ అంశాలకు తోడు ద్రవ్యోల్బణం దిగివచ్చేంతవరకూ ద్రవ్య విధానాన్ని కఠినంగానే కొనసాగించేందుకు ఫెడ్ కట్టుబడి ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మరో 60 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచవచ్చని రాధికారావు వివరించారు.