Cars-Bikes Costly | కొత్త సంవత్సరం 2023 వచ్చేసింది. అలాగే పలు మార్పులు కూడా అమల్లోకి వచ్చేశాయి. కొత్త సంవత్సరంతోపాటు వచ్చిన మార్పులు మీ జీవితం మీద, మీ పర్సు మీద ప్రభావం చూపనున్నాయి. ఇన్పుట్ వ్యయం పేరుతో ఈ నెల ఒకటో తేదీ (ఈ రోజు) నుంచే మారుతి సుజుకి, హ్యుండాయ్, టాటా మోటార్స్ తదితర కార్ల ధరలు పెరగనున్నాయి. మరోవైపు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. వీటితోపాటు ఆరు ఆర్థిక పరమైన అంశాల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. అవేంటో ఓ లుక్కేద్దామా.. !
ఆటోమొబైల్ రంగం.. ప్రత్యేకించి కార్లపై ద్రవ్యోల్బణం ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇన్పుట్ వ్యయం పెరగడంతోపాటు సరికొత్త ఉద్గార నియంత్రణలు అమల్లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో మారుతి సుజుకి మొదలు హ్యుండాయ్, టాటా మోటార్స్, అడి, మెర్సిడెస్ బెంజ్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతి సుజుకి తన కార్ల ధరలు రూ.1500 నుంచి రూ.8000ల్లోపు పెంచేసింది. కియామోటార్స్ వివిధ మోడల్ కార్ల ధరలు రూ.5000 పెరుగుతాయని ఇంతకుముందే ప్రకటించింది.
మారుతి సుజుకిలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్.. హ్యుండాయ్ నుంచి `ఐ10 నియోస్`, క్రెటా, వెన్యూ, వెర్నా, టక్సన్, టాటా మోటార్స్లో నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్ కార్ల ధరలు పెరిగాయి. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) రూల్స్ కేంద్రం అమల్లోకి తేనుండటంతో వచ్చే ఏప్రిల్లో మరో దఫా కార్ల ధరలు పెరుగుతాయి. టూవీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్ సైతం బైక్లు, స్కూటర్ల ధరలు పెంచేసింది.
బ్యాంకుల్లో బంగారం ఆభరణాలతోపాటు ఇతర విలువైన పత్రాలను దాచి పెట్టుకోవడానికి ఖాతాదారులు లాకర్లు తీసుకుంటారు. ఈ లాకర్ల కోసం గతేడాది జనవరిలో కొత్త నిబంధనలను ఆర్బీఐ అమల్లోకి తెచ్చింది. వాటిల్లో గత ఆగస్టులో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. దాని ప్రకారం 2023 జనవరి ఒకటో తేదీ లోపు ఖాతాదారులు తమ లాకర్ ఒప్పందాలు పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్లు తీసుకున్న వారు మూడేండ్లపాటు అద్దె, లాకర్ కేటాయింపు టైమ్లో చార్జీ కవర్ అయ్యేలా టర్మ్ డిపాజిట్లు పొందాల్సి ఉంటుంది.
ఇక నుంచి అన్ని రకాల బీమా పాలసీలు తీసుకునేవారు తప్పనిసరిగా కేవైసీ పత్రాలు సమర్పించాల్సిందే. హెల్త్, ఆటో, హోం, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేసేవారు కేవైసీ సమర్పించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) పేర్కొంది. ఇంతకుముందు బీమా పాలసీలకు కేవైసీ సమర్పించడం స్వచ్చందంగా ఉండేది.
వరుసగా ఏడుసార్లు ధర తగ్గింపు తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచుతున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఆదివారం నుంచి రూ.25 పెంచుతున్నట్లు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1769కి చేరుకున్నది. ముంబైలో రూ.1721, కోల్కతాలో రూ.1870, చెన్నైలో రూ.1971కి చేరుకున్నది. మరోవైపు, ఏడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పుల్లేవు.
జనవరి-మార్చి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు పెంచుతూ కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీరేట్లు పెంచడం వరుసగా రెండోసారి. వివిధ పథకాల వడ్డీరేట్లు 20 నుంచి 110 బేసిక్ పాయింట్లు పెరిగింది. కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేటు 7.2 శాతానికి పెరిగింది.