ముంబై, జూలై 26: బ్యాంకుల్లో ఎవరూ క్లెయిం చేయని డిపాజిట్లు భారీగా పెరిగిపోతున్నాయి. దాదాపు రూ.50 వేల కోట్లకు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వీటిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో ఓ అవగాహన ప్రచార కార్యక్రమానికి తెరతీసింది. ఈ తరహా డిపాజిట్లు ఎక్కువగా ఉన్న 9 రాష్ర్టాలపై ఈ సందర్భంగా ఆర్బీఐ ఫోకస్ పెడుతున్నది.
ఈ రాష్ర్టాల్లో తెలంగాణసహా తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కర్నాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని ఆర్బీఐ అధికారి ఒకరు అంటున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2021-22) బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.48,262 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21) ఇవి రూ.39,264 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వార్షిక నివేదిక చెప్తున్నది. ఇక ఆయా రాష్ర్టాల్లో ఈ ప్రచారం స్థానిక భాషలతోపాటు హిందీ, ఆంగ్ల భాషల్లోనూ జరుగుతుంది. నిజానికి గతంలోనూ ఈ రకమైన ప్రచారం నిర్వహించినా ఆశించిన ఫలితాలు మాత్రం రాకపోవడంపై ఆర్బీఐ సైతం ఒకింత ఆందోళన వెలిబుచ్చుతున్నది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం సేవింగ్స్/కరెంట్ ఖాతాల్లోని బ్యాలెన్స్లు పదేండ్లు అలాగే ఉండిపోయినా లేదా టర్మ్ డిపాజిట్ల మెచ్యూరిటీ ముగిసిన పదేండ్లలోపు ఎవరూ రాకపోయినా వాటిని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా వర్గీకరిస్తారు. ఈ సొమ్మును ఆర్బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేస్తాయి. అయినప్పటికీ ఈ సొమ్ము కోసం డిపాజిటర్లు ఎవరైనా వస్తే వడ్డీతోసహా బ్యాంకులు తిరిగి చెల్లిస్తాయి. ఒకవేళ డిపాజిటర్లు మరణిస్తే వారి వారసులు తగిన ధ్రుపపత్రాలతో బ్యాంకుల్ని సంప్రదించవచ్చు.