స్వపరిపాలనలో తెలంగాణ వైభవం అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ విజన్తో ఏటా అభివృద్ధి ఫలాలు నలుమూలలకూ చేరుతుండగా.. వ్యాపార, పారిశ్రామిక రంగాలు దూసుకుపోతున్నాయి.
ఫలితంగా ఎగుమతుల్లోనూ తెలంగాణ సత్తా చాటుతున్నది. ఇటీవలి సామాజిక, ఆర్థిక నివేదిక-2023 ఇందుకు అద్దం పడుతున్నది. 2021-22లో రూ.2.65 లక్షల కోట్లుగానమోదయ్యాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఎగుమతుల్లోనూ తెలంగాణ పరుగులు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సామాజిక, ఆర్థిక నివేదిక-2023 ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో తెలంగాణ నుంచి రూ.2,65,510 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇందులో సేవల రంగం వాటానే 69.13 శాతం. సరకు రవాణా వాటా 30.87 శాతంగా ఉన్నది.
తెలంగాణ జీఎస్డీపీలో సరకు ఎగుమతుల వాటా 7.1 శాతం. 2021-22లో తెలంగాణ నుంచి 81,971 కోట్ల విలువైన సరకు రవాణా జరగగా, అందులో ఔషధాలు, కెమికల్స్ వాటా 65 శాతంగా ఉన్నది. దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో 75 శాతం ఎగుమతులు ఐదు రాష్ర్టాల నుంచే జరుగుతుండగా.. ఈ జాబితాలో తెలంగాణ ఉండటం విశేషం. అమెరికా, చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఎక్కువగా మన రాష్ట్రం వస్తూత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి.
170 దేశాల్లో గిరాకీ
తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న సరకులకు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో గిరాకీ ఉందని నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021లో తేలింది. దేశం నుంచి సరకు ఎగుమతి చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో నిలిచింది. తెలంగాణలోకి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టడంతోపాటు ఆయా దేశాలకు ప్రతినిధి బృందాలను పంపుతున్నది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా కొత్త పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయడంతోపాటు పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టంను, నైపుణ్యంగల పనివాళ్లను తయారు చేస్తున్నది. పారిశ్రామిక ఉత్పత్తులు, తయారీ రంగంలో దేశంలోనే నాయకత్వ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు శరవేగంగా ముందుకు కదులుతున్నది.
ఐదు జిల్లాల నుంచే 85 శాతం
డాటా సెంటర్ స్పేస్లో హైదరాబాద్ హాట్స్పాట్గా ఎదుగుతున్నది. వ్యాపార అనుకూల వాతావరణంతో తెలంగాణలో ఎగుమతులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో నీతి ఆయోగ్ తెలిపింది. ఏప్రిల్ 2021-మార్చి 2022 మధ్య జరిగిన ఎగుమతుల్లో 85 శాతం మేడ్చల్-మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచే ఉన్నాయి. సరకు ఎగుమతి చేసిన జిల్లాల్లో నల్గొండ (2.45 శాతం), ఖమ్మం (2.25 శాతం), యాదాద్రి భువనగిరి (1.98 శాతం) ఉన్నాయి. వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రోడక్ట్లో భాగంగా అన్ని జిల్లాలు స్థానికంగా తయారయ్యే ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినది తెలిసిందే.