న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పలు ప్రతికూల సంకేతాల నడుమ అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం దేశీ స్టాక్ సూచీలు తీవ్ర నష్టాలతో ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 525 పాయింట్ల నష్టంతో 58,491 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 188 పాయింట్లు క్షీణించి 17,397 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో జరగనున్న పలు దేశాల కేంద్ర బ్యాంకుల సమావేశాల్లో ఉద్దీపనల్ని తగ్గింంపుపై నిర్ణయాలు తీసుకుంటారన్న అంచనాలు, చైనా రియల్టీ దిగ్గజం ఎవర్గ్రాండే దివాలా తీస్తుందన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగాయని, ఈ దిశగానే ఇక్కడి సూచీలు కూడా తగ్గినట్లు ట్రేడర్లు తెలిపారు. రూపాయి విలువ హఠాత్తుగా క్షీణించడం కూడా మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వారన్నారు. ముఖ్యంగా ఈ వారంలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కమిటీ మీటింగ్లో వడ్డీ రేట్ల పెంపు, ఉద్దీపన ఉపసంహరణ షెడ్యూల్స్ వెల్లడయ్యే అవకాశం ఉన్నందున, ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా అమ్మకాలు జరుపుతున్నట్లు జూలియన్ బేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలింగ్ ముచ్చాలా చెప్పారు. ఈ వారంలో ఇంగ్లాం డ్, జపాన్ సహా 16 దేశాల కేంద్ర బ్యాంకు ల సమావేశాలు జరగనున్నాయి. చైనా రియల్టీ కంపెనీ దివాలా తీస్తే ఈ ప్రభావం అన్ని మార్కెట్లపై పడుతుందన్న భయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరగడానికి కారణమని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ తెలిపారు.
టాటా స్టీల్ 10 శాతం క్రాష్
బీఎస్ఈ-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 9.53 శాతం పతనమయ్యింది. ఎస్బీఐ, ఇండస్ఇండ్బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్, మహింద్రా, అల్ట్రాటెక్ సిమెంట్లు కూడా భారీ నష్టాల్ని చవిచూసాయి. మరోవైపు హెచ్యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్లు లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ మెటల్స్ సూచి 7 శాతం క్షీణించింది. రియల్టీ, పవర్, యుటిలిటీ సూచీలు కూడా భారీగా తగ్గాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1.8 శాతం వరకూ పడిపోయాయి.
దేశీ స్టీల్ రంగంపై ఎవర్గ్రాండే ఎఫెక్ట్..
చైనా రియల్టీ దిగ్గజం ఎవర్గ్రాండే దివాలా తీస్తే దేశీయ స్టీల్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అంచనాలతో ఈ రంగంలోని షేర్లలో సోమవారం భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. టాటా స్టీల్ 10 శాతం క్రాష్కాగా, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, సెయిల్ తదితర స్టీల్ షేర్లు భారీగా తగ్గాయి. మన దేశీయ కంపెనీలు చైనాకు జరిపే ఉక్కు ఎగుమతులు నిలిచిపోతాయన్న అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ధరలు తగ్గుతాయన్న అంచనాలతో ఈ షేర్లలో అమ్మకాలు జరిగాయని ట్రేడర్లు చెప్పారు. ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తిచేసే ప్రభుత్వ రంగ ఎన్ఎండీసీ షేరు సైతం 7 శాతంపైగా పడిపోయింది.
ఇన్వెస్టర్ల సంపదకు రూ.3.49 లక్షల కోట్ల గండి..
తాజా మార్కెట్ క్షీణతతో ఇన్వెస్టర్లు రూ.3.49 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. స్టాక్ ఎక్సేంజీల్లో ట్రేడింగ్ జరిగే 6.15 గంటల సమయంలో నిముషానికి రూ.1000 కోట్ల చొప్పున సంపదను నష్టపోయారు. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,55,47,063 కోట్లకు తగ్గింది.