న్యూఢిల్లీ, ఆగస్టు 1: గత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్లు) దాఖలయ్యాయి. వీటి దాఖలుకు జూలై 31 గడువు ముగిసేతేదీనాటికి దాదాపు 2020-21 ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఐటీఆర్లు వచ్చాయి. 2020-21 సంవత్సరానికి పొడిగించిన గడువుతేదీ 2021 డిసెంబర్ 31కాగా, ఆ తేదీనాటికి 5.89 కోట్ల రిటర్న్లు దాఖలయ్యాయి. ఈ జూలై 31 చివరితేదీ ఆదివారం అయినప్పటికీ, ఆ రోజున భారీగా 72 లక్షల ఐటీఆర్లు వచ్చినట్లు ఆదాయపు పన్ను అధికారులు చెప్పారు.
రిటర్న్లు దాఖలు చేసినవారిలో ఖాతాల ఆడిటింగ్ అవసరం లేని జీతభత్యాలు పొందేవారు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అత్యధికంగా ఉన్నారు. తాజా నిబంధనల ప్రకారం 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి (2021-22 ఆర్థిక సంవత్సరం) రూ. 5 లక్షలు పైబడిన వార్షికాదాయం ఉన్నవారు జూలై 31వ తేదీ గడువు ముగిసిన తర్వాత..డిసెంబర్ 31లోగా ఐటీఆర్లు దాఖలు చేస్తే రూ. 5,000 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 లక్షల లోపు ఆదాయంగలవారు ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తున్నందుకు రూ.1,000 చెల్లించాలి. అలాగే జరిమానాతో పాటు చెల్లించాల్సిన పన్ను ఉంటే అందుకు నెలకు 1 శాతం అదనంగా వడ్డీ కట్టాలి. అయితే వార్షిక ఆదాయం పన్ను పరిమితికి లోపు ఉంటే ఆలస్య రుసుం చెల్లించనక్కర్లేదు.
ఐటీఆర్ వెరిఫికేషన్ కాలపరిమితి తగ్గింపు
ఆదాయపు పన్ను రిటర్న్ల ఈ-వెరిఫికేషన్కు ప్రస్తుత 120 రోజుల కాలపరిమితిని 30 రోజులకు తగ్గించినట్టు ఐటీ శాఖ తెలిపింది. ఆగస్టు 1 నుంచి ఈ తగ్గింపు అమలులోకి వచ్చింది. పన్ను చెల్లింపుదారులు రిటర్న్లు దాఖలు చేసిన తర్వాత వాటిని ఈ-వెరీఫై చేయడం లేదా ఐటీఆర్-వీ హార్డ్ కాపీని శాఖకు పోస్ట్లో పంపించాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ తర్వాతే రిటర్న్ దాఖలు ప్రక్రియ పూర్తవుతుంది.