న్యూఢిల్లీ, జూన్ 30 : విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) సురక్షిత చార్జింగ్ కోసం దేశంలోని దాదాపు 45 శాతం ఇండ్లను ఎలక్ట్రికల్గా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నదని మంగళవారం ఓ నివేదిక వెల్లడించింది. ‘ది నెట్-జీరో ట్రాన్సిషన్ స్టార్ట్స్ ఎట్ హోమ్: ఎనబ్లింగ్ ఈవీ-రెడీ రెసిడెన్సెస్ ఇన్ ఇండియా’ పేరిట కజమ్-ఏఈఈఈ సంయుక్తంగా విడుదల చేసిన ఈ రిపోర్టు.. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోగల 80 వేలకుపైగా నివాసాల్లో ఈవీ చార్జర్ ఇన్స్టాలేషన్స్ ఆధారంగా తయారైంది. ఈ క్రమంలోనే సుమారు 45 శాతం నివాసాల్లో సురక్షితంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ చార్జింగ్ కోసం మరింత మెరుగైన విద్యుత్ వ్యవస్థ, సదుపాయాలు అవసరమని తేలింది. గత పదేండ్ల నుంచి దేశంలో ఈవీల వినియోగం బాగా పెరిగిపోతున్నది. టూవీలర్లు, ప్యాసింజర్ కార్ల వినియోగదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. తేలికపాటి వాణిజ్య వాహనాలకూ డిమాండ్ పెరుగుతుండగా.. ప్రభుత్వాలు సైతం తమ పరిధిలోని రవాణా వ్యవస్థల్లో సంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాల స్థానంలో ఈవీలను పెంచుతూపోతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజా రిపోర్ట్ మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్లలో ఈవీల చార్జింగ్కున్న ఏర్పాట్లను మెరుగుపర్చాలని సూచించింది. ఈవీలను కొనేందుకు వీలున్నవారిలో కేవలం 55 శాతం మందికే వాటి చార్జింగ్కు అవసరమైన విద్యుత్తు వ్యవస్థ, సదుపాయాలు అప్గ్రేడ్గా ఉన్నాయని పేర్కొన్నది. ఇదిలావుంటే 2024లో ఈవీల చార్జింగ్కు సంబంధించి జాతీయ స్థాయిలో 0.2 శాతంగా ఉన్న విద్యుత్తు వినియోగం.. 2035లో దాదాపు 6 శాతానికి చేరవచ్చని ఈ సందర్భంగా అంచనా వేశారు. కాగా, అరకొర సదుపాయాలతో ఈవీల చార్జింగ్ ప్రమాదమని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఎన్నో ఈవీలు అగ్ని ప్రమాదాలకు గురికావడం చూస్తూనే ఉన్నాం. దీంతో పెరిగే ఈవీల వినియోగానికి తగ్గట్టుగా చార్జింగ్ వసతులూ ఉండాలని అటు ఇండస్ట్రీ, ఇటు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.