న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. జూన్తో ముగిసిన మూడు నెలలకాలానికి కంపెనీకి రూ.4,450.12 కోట్ల నష్టం వచ్చింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.8,443.98 కోట్ల నష్టంతో పోలిస్తే సగానికి సగం తగ్గినట్లు అయింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.31,983.06 కోట్ల నుంచి రూ.66,406.05 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. టాటా అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) తొలి త్రైమాసికంలో 5 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కంపెనీ సీఈవో థిర్రీ బొల్లర్ తెలిపారు. గత త్రైమాసికంలో సంస్థ 1,14,170 యూనిట్ల వాహన విక్రయాలు జరిపింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో విక్రయించిన దాంతో పోలిస్తే 351 శాతం అధికమని పేర్కొంది.