న్యూఢిల్లీ, జనవరి 4: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గతేడాది అక్టోబర్ నెలలోనూ కొత్తగా 31.59 లక్షల మంది జియో నెట్వర్క్ను ఎంచుకున్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీంతో జియో మొత్తం సబ్స్ర్కైబర్ల సంఖ్య 45.23 కోట్లకు చేరుకున్నారు. అలాగే భారతీ ఎయిర్టెల్ 3.52 లక్షల మంది ఎంచుకోవడంతో కస్టమర్ల సంఖ్య 37.81 కోట్లకు చేరారు. కానీ, వొడాఫోన్ ఐడియాకు మాత్రం కస్టమర్లు షాకిస్తున్నారు. అక్టోబర్ నెలలోనూ ఈ నెట్వర్క్ నుంచి 20.44 లక్షల మంది వైదొలిగారు.