న్యూఢిల్లీ, మే 18: క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీ మోత మోగనున్నది. వీటిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 28 శాతానికి పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు తమ తుది నివేదికను కూడా సిద్ధం చేసింది. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నివేదికను పరిశీలించి అధికారికంగా ధ్రువీకరించే వీలున్నది.
క్యాసినోలు, గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ అమలవుతున్నది. దీనిపై సమీక్షించేందుకు గత ఏడాది మే నెలలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాద్ సంగ్మా నేతృత్వంలో మంత్రుల బృందం ఏర్పాటైంది. బృందంలో తెలంగాణ ఆర్థిక మంత్రి టీ హరీశ్రావుసహా గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రులు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, గోవా పంచాయతీరాజ్ శాఖ మంత్రి తదితరులున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెలారంభంలో జీఎస్టీని 28 శాతానికి పెంచాలని ఈ బృందం ఏకగ్రీవంగా నిర్ణయించింది. బుధవారం మరోసారి సమావేశమై ఖరారు చేసింది. ‘క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్పై పన్ను విషయంలో మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది. నివేదికను ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేస్తాం. రాబోయే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం’ అని సంగ్మా ట్వీట్ చేశారు.