New IT hardware PLI scheme | ఐటీ, హార్డ్ ఉత్పత్తుల తయారీ కోసం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సియేటివ్ (పీఎల్ఐ) పథకం కింద 27 సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సంగతి కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దేశీయంగా టాబ్లెట్లు, లాప్టాప్లు, వ్యక్తిగత కంప్యూటర్లు, సర్వర్లు తదితర పరికరాల తయారీ పెంచేందుకు కేంద్రం ఈ పథకం రూపొందించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి లభించనున్నది.
డెల్, ఫాక్స్ కాన్, హెచ్పీ, ఫ్లెక్స్ ట్రానిక్స్, ఆప్టిమస్, ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, సోజో మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, గుడ్ వర్త్, నియో లింక్, సైర్మా ఎస్జీఎస్, మెగా నెట్ వర్క్, పానాజీ డిజిలైఫ్, ఐటీఐ వంటి సంస్థలు ఐటీ హార్డ్ వేర్ కింద పీఎల్ఐ స్కీమ్కు ఎంపికయ్యాయి. ఈ సంస్థలు పీఎల్ఐ కింద రూ.3000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇదిలా ఉంటే డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల నిరోధానికి సోషల్ మీడియా వేదికలకు నోటీసులు ఇచ్చామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తామన్నారు.