మొన్న రైల్వేలు.. నిన్న ఓడరేవులు.. నేడు విమానాశ్రయాలు.ప్రైవేటీకరణకు కాదేది అనర్హం అన్న రీతిలోముందుకెళ్తున్నది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరుతో అమ్ముతున్న కేంద్రం.. ఇక అభివృద్ధి సాకుతో ఎయిర్పోర్టులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇప్పుడు విమానాశ్రయాల వంతు వచ్చిం ది. 2022-25లో దేశంలోని 25 ఎయిర్పోర్టులను లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టు సోమవారం రాజ్యసభలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. నిర్వహణ, అభివృద్ధి, విమానయాన కార్యకలాపాలకుగాను దీర్ఘకాలానికి ఈ ఎయిర్పోర్టులను కార్పొరేట్ల చేతిలో పెడుతున్నట్టు వెల్లడించారు. పైగా ప్రజాప్రయోజనాల కోసమే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఈ 25 ఎయిర్పోర్టులను లీజింగ్కు ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు.
ఈ నగరాల్లోనే లీజింగ్..
జాతీయ నగదీకరణ పైప్లైన్ వివరాల ప్రకారం 2022-25లో దేశవ్యాప్తంగా ఏఏఐ ఆధ్వర్యంలోని 25 ఎయిర్పోర్టులను లీజుకు ఇస్తున్నారు. వీటిలో భువనేశ్వర్, వారణాసి, అమృత్సర్, తిరుచ్చి, ఇండోర్, రాయ్పూర్, కాలీకట్, కోయంబత్తూర్, నాగ్పూర్, పాట్నా, మదురై, సూరత్, రాంచీ, జోధ్పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి, హుబ్లీ, ఇంఫాల్, అగర్తల, ఉదయ్పూర్, డెహ్రాడూన్, రాజమండ్రి నగరాల్లోని విమానాశ్రయాలున్నాయి.
ఏపీకి చెందినవే మూడు..
ఏపీలోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్యలు చకచకా జరిగిపోయే వీలుందనీ తెలుస్తున్నది. ఇక వేగంగా వృద్ధి చెందుతున్న ప్రపంచ ఏవియేషన్ మార్కెట్లలో భారత్ ఒకటని, మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా ఇప్పటికే గుర్తింపు పొందిందని మంత్రి వీకే సింగ్ తెలిపారు. అలాగే దేశంలో 2.15 లక్షలకుపైగా ఉడాన్ విమానా లు నడుస్తున్నాయని, 2024కల్లా నిరుపయోగంగా ఉన్న, తక్కువ రద్దీ కలిగిన 100 ఎయిర్పోర్టులు, హెలీప్యాడ్స్, వాటర్ ఏరోడ్రమ్ల పునరుద్ధరణ, అభివృద్ధి దిశగా వెళ్తున్నట్టు చెప్పారు.
అదానీ చేతికే అన్నీ!
వడ్డించేవాడు మనవాడైతే వరుసలో ఏ మూలకు కూర్చున్నా విందు భోజనమే అన్నట్టుగా ఉన్నది అదానీ ఎంటర్ప్రైజెస్ పరిస్థితిప్పుడు. దేశంలోని ఎయిర్పోర్టులన్నీ గౌతమ్ అదానీ చేతికి వెళ్లినా ఆశ్చర్యం లేదనిపిస్తున్నది మరి. ప్రస్తుతం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో దేశవ్యాప్తంగా 13 విమానాశ్రయాలు నడుస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోగల ఏఏఐకి చెందినవే 8 ఉన్నాయి. అయితే వీటిలో ఏకంగా ఏడింటిని అదానీ ఎంటర్ప్రైజెస్ పీపీపీ విధానంలో పొంద డం గమనార్హం.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్కు చెందిన అదానీ సంపద గడిచిన ఎనిమిదేండ్లలో ఏ రకంగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏండ్ల తరబడి భారతీయ కుబేరుడిగా కొనసాగిన ముకేశ్ అంబానీని సైతం వెనక్కినెట్టి ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ ఉన్న సంగతీ విదితమే. ఈ క్రమంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూపోతున్న అదానీకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలుంటున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయిప్పుడు. ఈ ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ కూడా అందులో భాగమేనని, వచ్చే మూడేండ్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ చేతికి మరిన్ని రావడం ఖాయమేనంటున్నారు.
అదానీ దక్కించుకున్న ఏఏఐ విమానాశ్రయాలివే
దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు,వాటర్ ఏరోడ్రమ్స్, హెలీపోర్టులు 146
పీపీపీ విధానంలో నడుస్తున్న విమానాశ్రయాలు13
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనివే 08
రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినవి. వీటిలో హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్, కన్నూర్, దుర్గాపూర్ 05