హైదరాబాద్, అక్టోబర్ 13: పండుగ సీజన్లో తక్కువ ధరలో పుత్తడి కొనుగోలుకు వేచిచూస్తున్నవారికి షాక్నిస్తూ శుక్రవారం రాత్రి ఒక్కసారిగా బంగారం ధర భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-గాజాల మధ్య యుద్ధం తీవ్రతరంకావడంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ఫ్యూచర్ ధర ఒక గంట సమయంలోనే 55 డాలర్లు పెరిగి 1,942 డాలర్లకు చేరింది. స్పాట్ ధర అంతేమొత్తం పెరుగుదలతో 1,929 డాలర్లకు పెరిగింది. ఈ ట్రెండ్ను ప్రతిబింబిస్తూ భారత్లోని మల్లీ కమోడిటీ ఎక్సేంజ్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ఫ్యూచర్ ధర భారీగా రూ.1,500 పెరిగిపోయి రూ.59,400 స్థాయికి చేరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయమైన మార్చి 17 తర్వాత ఒకే రోజున బంగారం ధర ఇంతిలా పెరగడం ఇదే ప్రధమం.
వాస్తవానికి శుక్రవారం భారత్లోని వివిధ నగరాల స్పాట్ బులియన్ మార్కెట్ల ట్రేడింగ్ నిలిచిపోయిన తర్వాత ప్రపంచ మార్కెట్లో ఈ పరిణామం చోటుచేసుకున్నది. ఇదే ట్రెండ్ అమెరికా మార్కెట్లు ముగిసేంతవరకూ కొనసాగితే శనివారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.60,000 స్థాయిని మించుతుంది. ఇది శుక్రవారం సాయంత్రం రూ.58,910 వద్ద ముగిసింది. తాగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించడంతో పాటు 24 గంటల్లోగా ఉత్తర గాజాను వదిలివెళ్లాలంటూ పౌరుల్ని హెచ్చరించడంతో యుద్ధం తీవ్రతరమవున్నదన్న భయాలు మార్కెట్లో ఏర్పడ్డాయి. విపత్కర పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే బంగారం కొనుగోలుకు ఇన్వెస్టర్లు పరుగులు తీశారని బులియన్ ట్రేడర్లు తెలిపారు.
ఈ నెల 6న హైదరాబాద్లో రూ.57, 230 పలికిన 24 క్యారెట్ల తులం పసిడి తాజా పరిమాణంతో రూ.60, 300 వరకూ పెరిగే అవకాశం ఉన్నందున, ఒకే వారంలో ధర రూ.3,000 మేర పుంజుకున్నట్లవుతుంది. ప్రపంచ మార్కెట్లో స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఈ వారంలో 1,810 డాలర్ల నుంచి 1,926 డాలర్లకు చేరుకున్నది. ఈ ఏడాది మార్చి తర్వాత ఒకే వారంలో పుత్తడి 5 శాతం మేర పెరగడం ఇదే తొలిసారి. అక్టోబర్ 7 ఇజ్రాయిల్పై గాజా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి క్రమేపీ పెరుగుతూ వస్తున్న పుత్తడి తాజాగా మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినందున ఒక్కసారిగా భగ్గుమన్నది.