న్యూఢిల్లీ, జూన్ 22: బహుళ వ్యాపార దిగ్గజం ఐటీసీలో ఏటా కోటి రూపాయలకుపైగా జీతం తీసుకుంటున్న ఉద్యోగులు మరింత పెరిగారు. ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయలకుపైగా వార్షిక వేతనం పొందుతున్నవారు 220కి చేరారు.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020-21)తో పోల్చితే 44 శాతం అధికం. గతంలో 153 మందికే ఏటా కోటి రూపాయలకుపైగా జీతం వచ్చేదని తాజాగా విడుదలైన సంస్థ వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొన్నది. వీరందరికీ నెలనెలా రూ.8.5 లక్షలు, ఆపై వేతనం వస్తున్నట్టు పేర్కొన్నది. కాగా, ఈ మార్చి చివరినాటికి ఐటీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 23,829గా ఉన్నది. నిరుడు మార్చి ఆఖరుతో చూస్తే 8.4 శాతం తక్కువ.
ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సంజీవ్ పురీ గత ఆర్థిక సంవత్సరం రూ.12.59 కోట్ల జీతం తీసుకున్నారు. అంతకుముందుతో పోల్చితే ఇది 5.35 శాతం ఎక్కువ. ఇందులో ఏకీకృత వేతనం రూ.2.64 కోట్లుగా ఉంటే, పనితీరు ఆధారంగా వచ్చే బోనస్ రూ.7.52 కోట్లుగా ఉన్నది. పెర్క్స్/ఇతరత్రా ప్రయోజనాలుగా మిగతా మొత్తం ఉన్నట్టు సంస్థ తెలియజేసింది. 2020-21లో రూ.11.95 కోట్ల వేతనం పొందారు. ఇక కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బీ సుమంత్, ఆర్ టండన్ జీతాలు 2021-22లో రూ.5.76 కోట్లు, రూ.5.6 కోట్లుగా ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరం సగటున ఉద్యోగుల వేతనం 7 శాతం ఎగబాకింది. మధ్యస్థాయి ఉద్యోగుల జీతం 4 శాతం ఎగిసింది. ప్రధాన మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగుల జీతం 8 శాతం పెరిగింది. 2021-22లో ఐటీసీ స్థూల ఆదాయం రూ.59,101 కోట్లుగా ఉన్నది. 2020-21లో ఇది రూ.48,151.24 కోట్లుగానే ఉన్నది.