IT Returns | గత ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 31తో గడువు ముగుస్తున్నది. ఈ దఫా గడువు పెంచేది లేదని కేంద్ర రెవెన్యూవిభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తేల్చి చెప్పారు. ఐటీఆర్ సబ్మిట్ చేయడానికి మరో 72 గంటల గడువు మాత్రమే ఉంది. దీంతో ఐటీఆర్ సబ్మిట్ చేయని వేతన జీవుల్లో ఆందోళన పెరిగిపోతున్నది. ఇప్పటివరకు సుమారు 30 లక్షల ఐటీ రిటర్న్స్ ఫైల్ అవుతున్నాయి. బుధవారం సాయంత్రానికి 3.73 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. తాజాగా ఐటీ విభాగం చేసిన ట్వీట్ ఆసక్తిదాయకంగా ఉంది.
`ఒకవేళ మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే, వెంటనే ఫైల్ చేయండి.. అపరాధ రుసుముకు దూరంగా ఉండండి!` అని ట్వీట్ చేసింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్పై లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వే కాస్త ఆసక్తికరంగా మారింది. సర్వేలో పాల్గొన్న వారిలో 41 శాతం మంది ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఐటీఆర్లు సబ్మిట్ చేస్తామని గ్యారంటీగా చెప్పలేం అంటున్నారు. 59 శాతం మంది ఇప్పటికే ఐటీఆర్లు ఫైల్ చేశామని పేర్కొన్నారు. ఐటీఆర్లు దాఖలు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని లోకల్ సర్కిల్స్ స్టడీ సర్వేలో మరో 10 శాతం మంది చెప్పారు.
13 శాతం మంది జూలై 31లోపు చాలా పనులు పూర్తి చేయాల్సి ఉందంటున్నారు. తొమ్మిది శాతం మంది మాత్రం గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయలేం అంటున్నారు. ఈ సర్వేలో 11,081 మంది పాల్గొన్నారు. వారిలో 59 శాతం మంది ఐటీఆర్ సబ్మిట్ చేశాం అని తెలిపారు. ఇక 9 శాతం మంది గడువు లోపు ఫైల్ చేస్తామని సంకేతాలిచ్చారు. అయినా 13 శాతం మంది గట్టిగా ప్రయత్నిస్తామని చెబితే, మరో 9 శాతం మంది అసలు సాధ్యం కాదని పేర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా 306 జిల్లాల్లోని 11,081 మంది అభిప్రాయాలను లోకల్ సర్కిల్స్ స్వీకరించింది. 69 శాతం మంది పురుషులు కాగా, 31 శాతం మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. మెట్రోపాలిటన్ నగరాలు, ప్రథమ శ్రేణి జిల్లాల నుంచి 44 శాతం మంది, ద్వితీయ శ్రేణి జిల్లాల నుంచి 33, మూడవ, నాల్గవ శ్రేణి జిల్లాల నుంచి 23 శాతం మంది సర్వేలో భాగస్వాములయ్యారు.