మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27 : ఎనిమిది నెలల కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టులు మూతపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చట్టాల ఆర్డినెన్స్పై సుప్రీం కోర్టు స్టే విధించడంతో జిల్లాలోని చెక్పోస్టులు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో మార్కెట్ కమిటీలకు అదనపు ఆదాయం సమకూరనున్నది. వ్యవసాయం మార్కె ట్ పరిధిలో చేసే కొనుగోళ్లు మినహా ప్రైవేట్గా జరిగే వ్యాపారానికి పన్ను వసూలు బాధ్యతను తప్పించడంతో గతేడాది జూన్ 6వ తేదీన తొలగించారు. దీంతో మార్కెట్లకు వచ్చే అదనపు ఆదాయం తగ్గిపోయింది. చిల్లర వ్యాపారం విచ్చలవిడిగా పెరిగింది. ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు రైతులను దగా చేశారు. దీనికి తోడు ఎలాంటి పన్నులు లేకుండా పంట ఉత్పత్తుల వ్యాపారం జోరుగా సాగింది.
కోల్పోయిన ఆదాయం..
చెక్పోస్టుల మూసివేతతో జిల్లాలోని చెక్పోస్టుల నుంచి వచ్చే ఆదాయం కోల్పోవాల్సి వచ్చిం ది. ముఖ్యంగా జిల్లాలోని మాచవరం, పిల్లికోటాల్, పొతంశెట్టిపల్లి, రామాయంపేట, రామంతాపూర్, ఏడుపాయల కమాన్, పోతరాజ్పల్లి, నర్సాపూర్ ఎక్స్ రోడ్డులో కలిపి మొత్తం 8 చెక్పోస్టులు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.8 లక్షల వరకు ఆదాయం సమకూరేది. 8 నెలల నుంచి చెక్పోస్టులను మూసివేయడంతో లక్షల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.
విక్రయాలపై మార్కెటింగ్ శాఖ నిఘా..
చెక్పోస్టులు తెరుచుకోవడంతో ప్రైవేట్ చిల్లర వ్యాపారం చేసే వారిపై నిఘా పెంచారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో లైసెన్స్లు లేకుండా అక్రమంగా వ్యాపారాలు చేసే వారిపై కన్నేసి ఉంచింది. ప్రతి విక్రయంపై ఇక నుంచి మార్కెటింగ్ శాఖ ఆజమాయిషీ ఉండనున్నది.