డిస్కౌంట్ కంట్రోల్ పాలసీపై విధించిన సీసీఐ
న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొరడా ఝుళిపించింది. కంపెనీ డీలర్ డిస్కౌంట్ కంట్రోల్ పాలసీపై సోమవారం రూ.200 కోట్ల జరిమానా వేసిం ది. 60 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఈ పాలసీ కాంపిటీషన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని, వెంటనే ఆపేయాలని తమ 39 పేజీల ఆర్డర్లో పేర్కొన్నది. డిస్కౌంట్ల విషయంలో డీలర్లపై మారుతి నియంతృత్వ ధోరణిపట్ల 2019 జూలైలో సీసీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తుది ఆదేశాలు జారీ చేసింది. తాము అనుమతించిన ఆఫర్ల కంటే మించి కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వకుండా డీలర్లతో మారుతి ఒప్పందం కుదుర్చుకున్నదని సీసీఐ తమ దర్యాప్తులో గుర్తించింది. ఒకవేళ అదనపు డిస్కౌంట్లు ఇవ్వదల్చుకుంటే మారుతి నుంచి డీలర్లు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అలాకాకుండా ఏ డీలరైనా ఈ పాలసీని ఉలంఘిస్తే జరిమానాలుంటాయి. కార్ల సరఫరానూ ఆపేస్తుంది. ఇక డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ అమలుకు మారుతి సుజుకీ మిస్టరీ షాపింగ్ ఏజెన్సీలనూ నియమించుకున్నట్లు తమ తాజా రిపోర్టులో సీసీఐ తెలిపింది. మారుతి డీలర్ల వద్దకు కస్టమర్లుగా ఈ ఏజెన్సీ ప్రతినిధులు వెళ్లి అదనపు డిస్కౌంట్లపై ఆరా తీస్తారు. ఆ తర్వాత ఆ విషయాన్ని మారుతికి నివేదిస్తారు. దీని ఆధారంగా డీలర్లను మారుతి వివరణ కోరుతుంది. సంతృప్తికరంగా లేకపోతే జరిమానాలు తప్పవు. ఇదిలావుంటే సీసీఐ ఆదేశాలను పరిశీలిస్తున్నామని, ఆ తర్వాత న్యాయపరంగా సవాల్కున్న అవకాశాలను వినియోగించుకుంటామని మారుతి సుజుకీ తెలిపింది.