న్యూఢిల్లీ, డిసెంబర్ 14: హైదరాబాద్కు చెందిన ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న (సోమవారం) మొదలు కానున్నది. వచ్చే బుధవారం ముగుస్తుంది. అయితే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ శుక్రవారం నుంచే ప్రారంభమవుతుంది. కాగా, ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ధరల శ్రేణిని రూ.347-366 గా నిర్ణయించారు. మూడు రోజుల ఈ పబ్లిక్ ఇష్యూలో షేర్ల విక్రయం ద్వారా రూ.1,500 కోట్లదాకా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ బుధవారం తెలియజేసింది. సంస్థ ప్రస్తుత ప్రమోటర్.. జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)గానే ఈ ఐపీవో వస్తున్నది. కేఫిన్ టెక్నాలజీస్లో ప్రమోటర్, వారి గ్రూప్నకు 74.37 శాతం వాటా ఉండగా, కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్కు మరో 9.98 శాతం వాటా ఉన్నది. ఇదిలావుంటే ఈ పబ్లిక్ ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం 75 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10 శాతం షేర్లు కేటాయించారు. మదుపరులు కనీసం 40 షేర్లనైనా సబ్స్ర్కైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.