న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: తాజాగా ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర పన్ను వసూళ్లు 18 శాతం వృద్ధి చెంది రూ.16.61 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్తో కలుపుకుంటే స్థూల పన్ను వసూళ్లు 20.33 శాతం వృద్ధితో రూ.19.68 లక్షల కోట్లకు పెరిగినట్టు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన తెలిపింది. బడ్జెట్లో సవరించిన అంచనాలకంటే అధికంగా వసూళ్లు నమోదయ్యాయి. 2021-22లో నికర పన్ను వసూళ్లు 17.63 శాతం అధికమై రూ.14.12 లక్షల కోట్లకు చేరాయి. 2022-23 కేంద్ర బడ్జెట్లో రూ.14.20 లక్షల కోట్లు అంచనా వేయగా, అటుతర్వాత రూ.16.50 లక్షల కోట్లకు సవరించారు. వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయపు పన్నుల్ని ప్రత్యక్ష పన్నులుగా వ్యవహరిస్తారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.3.07 లక్షల కోట్ల రిఫండ్స్ చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది.