ప్రైవేట్కు చెందిన రిలయన్స్ జియో.. దేశంలోనే అత్యధిక ల్యాండ్ లైన్ (ఫిక్స్డ్) కనెక్షన్లు కలిగిన సంస్థగా అవతరించి, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను అధిగమించింది.
ఫిక్స్డ్ లైన్ టెలికం సేవల దిగ్గజం, దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్-మానవ వనరుల సంస్థ, 22 ఏండ్ల చరిత్ర కలిగిన ఓ ప్రభుత్వ కంపెనీని పసికూన జియో వెనుకకు నెట్టేసిందంటే ఆశ్చర్యమేస్తోంది కదూ.
నిజమే.. కుక్కను చంపాలంటే ముందు దానిపై పిచ్చిదిగా ముద్ర వేయాలని, అప్పుడే సునాయాసంగా చంపవచ్చని చెప్పే సామెత గుర్తుకు వస్తోంది మరి. మోదీ సర్కారు ఇదే ఎత్తుగడ వేసిందంటున్నారిక్కడ.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మోదీ సర్కారు ప్రైవేట్ వారికి అప్పనంగా కోట్లకుకోట్లు దోచిపెడుతూ ప్రభుత్వ కంపెనీలను నిర్వీర్యం చేస్తున్నదని ఎంత మంది గగ్గోలు పెడుతున్నా.. అవేమీ వారికి పట్టట్లేదు. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కష్టాల వెనుకా కేంద్రం నిర్లక్ష్యమే కనిపిస్తున్నది. నిజానికి ‘వ్యాపార సంస్థలను నడపడం ప్రభుత్వం పని కాదు’ అంటూ 2014లోనే భారత్-అమెరికా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో పబ్లిగ్గానే చెప్పిన ఘనత మన ప్రధాని మోదీది. పెట్టుబడుల ఉపసంహరణ పేరిట అటల్ బిహారీ వాజ్పేయి హయాంలోని బీజేపీ ప్రభుత్వం మొదలు పెట్టిన కార్యక్రమాన్ని మోదీ సర్కారు మరింత వేగంగా ముందుకు తీసుకుపోతోంది. దీనికై ప్రత్యేక మంత్రిత్వ శాఖే ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్పరం చేయడానికి ప్రణాళికా బద్దమైన కుట్రలు పన్నడమే ఈ యం(మం)త్రాంగం ముఖ్యోద్దేశం. 2021-22 వార్షిక బడ్జెట్లోనే మోదీ సర్కారు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పింది. లాభాల్లో నడుస్తున్న కంపెనీలను కూడా క్రమంగా ప్రైవేట్ వారికి ధారాదత్తం చేసే ప్రక్రియలో భాగంగానే బీజేపీ సర్కారు.. ప్రధాన ప్రభుత్వ కంపెనీలను నిర్వీర్యం చేస్తున్నదని ప్రతిపక్షాలే కాదు, ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులూ ఆరోపిస్తున్నారు.
బీఎస్ఎన్ఎల్ పునరుధ్ధరణ పేరిట కేంద్రం రూ.70 వేల కోట్లు ప్రకటించినా, అందులో రూ.30 వేల కోట్లను ఉద్యోగుల పదవీ విరమణ పథకానికే కేటాయించారు. దీంతో తొలిరోజే రెండు ప్రభుత్వ టెలికం సంస్థల నుంచి 92 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం పథకం ప్రకారం ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూపోతుండటంతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. దీంతో సంస్థకున్న మార్కెట్ పడిపోతున్నది. మరోవైపు ప్రైవేటు టెలికం కంపెనీలకు వారు కోరుకున్నట్టు నాన్ టెలికం ఆదాయంపై పన్ను చెల్లించకుండా వెసులుబాటు కల్పిస్తుండటం గమనార్హం.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నదన్న ఆరోపణల మధ్య కొత్తగూడెం జిల్లాకు చెందిన కిషోర్ కుమార్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసిన దరఖాస్తుతో అనేక వివరాలు బయటకొచ్చాయి. దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్కు రూ.95 వేల కోట్ల ఆస్తులున్నట్టు తేలింది. అయితే టెలికం రంగ సంస్కరణల నేపథ్యంలో మూడు ప్రైవేటు టెలికం కంపెనీల (జియోతోసహా)కు లబ్ధి చేకూర్చేలా సుమారు 2 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. బీఎస్ఎన్ఎల్పట్ల పూర్తి విరుధ్ధంగా ప్రవర్తిస్తోంది. కేంద్ర మంత్రి స్వయంగా ఉద్యోగుల పనితీరు మార్చుకోకపోతే తామేమీ చేయలేమంటూ, సంస్థ నష్టాలకు ఉద్యోగులే కారణంగా ప్రకటించడం వ్యూహాత్మకమే అని విశ్లేషకులు చెప్తున్నారు.