New Job Offers | మిలియనిల్స్ కాస్త కష్టపడితే చాలు.. పుష్కలమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి మొదలైంది. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటేనే వర్క్ ఫ్రం హోం సేవలందించొచ్చు. అంటే డిజిటల్ సేవలకు టెలికం రంగం కీలకం. ఇక కరోనా అనంతరం ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కనుక హెల్త్కేర్ సేవలు కూడా అవసరమే. కనుక మున్ముందు ఇంజినీరింగ్, టెలికం, హెల్త్కేర్ రంగాలు కీలకం కానున్నాయి. వచ్చే ఐదేండ్లలో 1.2 కోట్ల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతియేటా ఉద్యోగ అవకాశాలు 25-27 శాతం పెరుగుతాయని హైరింగ్ ఫర్మ్ టీం లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. కేంద్రం పీఎల్ఐ స్కీం, విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇంజినీరింగ్, టెలికం, హెల్త్కేర్ రంగాల్లో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది.
ప్రొఫెషనల్ స్టాఫింగ్-డిజిటల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ అనే పేరుతో టీం లీజ్ డిజిటల్ నివేదిక రూపొందించింది. వచ్చే ఐదేండ్లలో ఈ రంగాల నుంచి జీడీపీ పెరుగుతుందని అంచనా వేసింది. ఈ మూడు రంగాలు దేశీయ ఆర్థిక వ్యవస్థ భారీ పరివర్తనకు దోహదం చేస్తాయని టీం లీజ్ డిజిటల్ స్పెషలైజ్డ్ స్టాఫింగ్ హెడ్ సునీల్ సీ చెప్పారు.
2025 నాటికి దేశ జీడీపీలో ఇంజినీరింగ్ రంగం 27 శాతం, టెలికం 10, హెల్త్కేర్ రంగం 2.5 శాతం వాటా కంట్రిబ్యూషన్ అందిస్తాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇంజినీరింగ్లో మూడు కోట్లు, టెలికంలో 40 లక్షలు, హెల్త్కేర్లో 75 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. 2025-26లో ఇంజినీరింగ్ రంగంలో 3.8 కోట్ల మంది, టెలికంలో 60 లక్షలు, హెల్త్కేర్లో 95 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.
2022లో ఇంజినీరింగ్లో స్పెషలైజ్డ్ స్టాఫ్ 10 శాతం ఉంటే, 2026కల్లా 15 శాతానికి పెరుగుతుంది. టెలికం రంగంలో 11 శాతం (2022) నుంచి 2026కల్లా 16 శాతానికి, హెల్త్కేర్ సెక్టార్లో 15 (2022) శాతం నుంచి 2026 నాటికి 25 శాతానికి స్పెషలైజ్డ్ స్టాఫ్ పెరుగుతారు.
టెలికం, ఇంజినీరింగ్, హెల్త్కేర్ రంగాల్లో 4.2 కోట్ల మందికి పైగా ఉద్యోగులు నియమితులవుతారు. మొత్తం దేశంలోని వివిధ రంగాల్లోని ఉద్యోగుల్లో ఇది 8.7 వాతం మాత్రమే. 2026 నాటికి కొత్తగా 1.2 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయి. 46 లక్షల స్పెషలైజ్డ్ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని టీం లీజ్ డిజిటల్ వెల్లడించింది.