IT | ఆర్థిక సంవత్సరం ముగుస్తోందంటే ఉద్యోగులంతా పన్ను ఆదా ప్రణాళికల కోసం పరుగులు తీస్తారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, యూలిప్స్, ఎల్ఐసీ, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ), హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ హడావుడిపడేవాళ్ల సంఖ్య ఈ సీజన్లో కాస్త ఎక్కువే. వాస్తవానికి మన ఓవరాల్ ప్లానింగ్లో పన్ను ఆదా ఒక భాగంగానే ఉండాలి. కానీ పన్ను తగ్గాలనే ఉద్దేశంతోనే మనం పెట్టుబడులు పెట్టకూడదు. అంతేకాదు ఏడాది మొదట్లోనే మనం ప్లానింగ్ ప్రారంభించాలి. చివరలో చేసే ఏ ప్రణాళికైనా పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వదని తెలుసుకోండి. కాబట్టి వచ్చే ఏడాది నుంచైనా ముందస్తు ప్రణాళిక ఉంటే మంచి వెల్త్ క్రియేట్ చేయడంతోపాటు నాలుగు డబ్బులు ఆదా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ సమయంలో మనకు అందుబాటులో ఉన్న కొన్ని పన్ను మినహాయింపులు చూద్దాం.
ఉద్యోగి ఇంటి అవసరాలు తీర్చేందుకు సంస్థ.. వాళ్లకు ఇచ్చే అకామిడేషన్ ఖర్చును మనం హౌజ్ రెంట్ అలవెన్స్ కింద పరిగణిస్తాం. ఇది పాక్షికంగా లేదా పూర్తిగా మినహాయింపును పొందొచ్చు. ప్రస్తుతం మీరు ఉంటున్న ఇంటి రెంట్ను ఇది కవర్ చేస్తుంది. మీ శాలరీ ప్యాకేజీలో హెచ్ఆర్ఏ ఉన్నప్పుడు, అది కూడా మీరు పాత పన్ను విధానంలో ఉన్నప్పుడే ఈ క్లెయిం చేసుకోగలరు.
మీరు గృహ రుణం తీసుకున్నప్పుడు దానిపై చెల్లించే వడ్డీని మినహాయింపుగా పొందవచ్చు. సెక్షన్ 24బీ కింద ఏటా గరిష్ఠంగా రూ.2 లక్షల హోమ్లోన్ వడ్డీని డిడక్షన్గా పొందవచ్చు. అదే సమయంలో సెక్షన్ 80సీ కింద లక్షన్నరదాకా ప్రిన్సిపుల్ అమౌంట్నూ మన ట్యాక్సబుల్ మొత్తం నుంచి మినహాయింపును అందుకోవచ్చు.
ప్రభుత్వం అందించే కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకూ మినహాయింపు పొందే వీలున్నది.
తమ ఉద్యోగులు దేశంలో ఎక్కడైనా పర్యటించినప్పుడు చేసే ఖర్చులను ఆయా సంస్థలు లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్టీఏ) కింద ఇవ్వవచ్చు. మీతోపాటు కుటుంబ సభ్యులు చేసే విహార యాత్రలు కవర్ అవుతాయి. నాలుగేండ్ల క్యాలెండర్లో రెండు ప్రయాణాలకు మాత్రమే ఎల్టీఏను క్లెయిం చేసుకోవచ్చు.
సోడెక్సో వంటి మీల్ ఓచర్స్ను ఉద్యోగులకు కంపెనీలు ఇస్తాయి. వీటి ద్వారా గరిష్ఠంగా ఏడాదికి రూ.26,400 వరకూ ఎగ్జంప్షన్ పొందవచ్చు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) కోసం ఉద్యోగులు చేసే కంట్రిబ్యూషన్పైనా పాక్షికంగా పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపును పొందే వీలుంది.
ఎంప్లాయర్స్ రీయింబర్స్మెంట్ కింద వీటన్నింటినీ రీయింబర్స్ చేసుకోవచ్చు. అయితే ఇవి సేల్స్లో ఉన్నవాళ్లకు వర్తిస్తాయి. అంతేగాక కంపెనీనిబట్టి మిడ్, సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్కు మాత్రమే వర్తించే అవకాశమున్నది.
గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు ఇది వర్తిస్తుంది. పిల్లల స్కూల్ ఫీజుల నిమిత్తం నెలకు చదువు కోసం రూ.100 మినహాయింపును పొందవచ్చు. హాస్టల్ వసతి కోసం రూ.300 వరకూ మినహాయింపును తీసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018 బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ను మళ్లీ ప్రారంభించారు. గ్రాస్ శాలరీ నుంచి రూ.50 వేల డిడక్షన్ పొందవచ్చు.
సెక్షన్ 80డీ కింద మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిం పొందవచ్చు. పాలసీ తీసుకునేందుకు చెల్లించే ప్రీమియం మొత్తంలో గరిష్ఠంగా రూ.25 వేల వరకూ క్లెయిం తీసుకోవచ్చు. అలాగే మనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం తీసుకునే పాలసీలపైనా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
-నాగేంద్రసాయి కుందవరం