గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లకు అనూహ్య స్పందన
హైదరాబాద్, ఫిబ్రవరి 7: ప్రముఖ మొబైల్ సంస్థ సామ్సంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లకు భారత్లో అనూహ్య స్పందన లభించింది. ముందస్తు బుకింగ్లు ఆరంభించిన 25 గంటల్లోనే 1.40 లక్షల బుకింగ్లు వచ్చాయి. వీటి విలువ రూ.1,400 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. ఈ నెల 2న ముందస్తు బుకింగ్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లను 200 మెగాపిక్సెల్ కెమెరా, ముందుభాగంలో డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ టెక్నాలజీ కెమెరా ఉన్నాయి. రీసైక్లింగ్ పరికరాలతో నోయిడా ప్లాంట్లోనే ఈ మొబైళ్లను తయారుచేసినట్లు సామ్సంగ్ మొబైల్ బిజినెస్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా తెలిపారు. ఏడు రకాల్లో లభించనున్న ఈ ఫోన్ కనిష్ఠంగా రూ.74,999..గరిష్ఠ ధర రూ.1,54,999గా నిర్ణయించింది. ఈ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి గెలాక్సీ వాచ్4 ఎల్టీఈ క్లాసిక్, గెలాక్సీ బడ్స్2ని రూ.4,999కి అందిస్తున్నది.
రిలయన్స్ డిజిటల్లో..
సామ్సంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్23 ఫోన్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లభించనున్నాయని కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోరియన్ బడే మాట్లాడుతూ..సామ్సంగ్తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు, దీంతో తమ కస్టమర్లకు నూతన ఫ్లాగ్షిఫ్ మొబైళ్లను అందిస్తున్నట్లు చెప్పారు.