బీజింగ్: ఆలీబాబా వ్యవస్థాపకుడు- చైనా కుబేరుడు జాక్మాకు, చైనా ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరో మలుపు తిరిగాయి. మీడియా సంస్థల్లో ఆలీబాబా పెట్టిన పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని జాక్మాను చైనా సర్కార్ ఆదేశించినట్లు సమాచారం. ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు ఆలీబాబా ప్రయత్నించడం ఆందోళనకరం అని చైనా అధికారులు అభిప్రాయపడుతున్నారని పేర్కొంటూ వాల్స్ట్రీట్ జనరల్ ఓ వార్తాకథనం ప్రచురించింది. ఏయే మీడియా సంస్థల్లో ఆలీబాబా పెట్టుబడులు ఉన్నాయన్న సంగతిని చైనా సర్కార్ బయటపెట్టలేదు.
118 ఏండ్ల క్రితం హాంకాంగ్లో స్థాపించిన ఇంగ్లిష్ దిన పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో ఆలీబాబా పెట్టుబడులు పెట్టింది. ట్విట్టర్ తరహా చైనా సోషల్ మీడియా వైబోతోపాటు పలు మీడియా సంస్థల్లో ఆలీబాబా వాటాలు కొనుగోలు చేసింది. ప్రింట్, టీవీ, డిజిటల్, సోషల్ మీడియా, అడ్వర్టైజింగ్ సంస్థల్లో ఆలీబాబా పెట్టుబడులు.. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీకి, శక్తిమంతమైన దాని ప్రచారానికి సవాళ్లు విసురుతున్నాయని ప్రభుత్వ వర్గాల కథనం. చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షలపై ఆలీబాబా స్పందించలేదు. చైనా అధికారులు కూడా అందుబాటులోకి రాలేదు.
అయితే, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఉద్యోగులకు దినపత్రిక సీఈవో గ్యారీ లియు మంగళవారం లేఖ రాశారు. తమ పత్రిక పట్ల ఆలీబాబా కమిట్మెంట్లో ఎటువంటి మార్పులేదని పేర్కొన్నారు. తమ మిషన్, బిజినెస్ లక్ష్యాల సాధనకు ఆలీబాబా మద్దతు కొనసాగుతుందన్నారు. అమెరికా లిస్టెడ్ మీడియా సంస్థల్లోనూ ఆలీబాబాకు వాటాలు ఉన్నాయి. మొత్తం మీడియా సంస్థల్లో ఆలీబాబా పెట్టుబడుల వివరాలు వెల్లడి కాకున్నా సోమవారం అమెరికాలో స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయానికి ఆ పెట్టుబడులు 800 కోట్ల పైచిలుకేనని తెలుస్తున్నది. వైబోలో సుమారు 350 కోట్ల డాలర్లు, బిలిబిలి ఇంక్ అనే వీడియో ప్లాట్ఫామ్లో 260 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఉన్నాయని సమాచారం.