న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ అపర కుబేరుల జాబితాలో చేరారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఆయన 20వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది అదానీ గ్రూపునకు చెందిన వివిధ రంగాల షేర్లు గణనీయంగా పెరగడంతో ఆయన సంపద కూడా అంతే భారీ స్థాయిలో పెరిగింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తర్వాత ఫోర్బ్స్ టాప్-20 జాబితాలో స్థానం దక్కించుకున్న రెండవ భారతీయునిగా అదానీ నిలిచారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు గనుల్లాంటి వివిధ రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న అదానీ గ్రూపు ఇటీవల సాంకేతిక రంగంలోకి కూడా అడుగు పెట్టింది. 2021లో అదానీ గ్రూపునకు చెందిన టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్ల విలువ ఏకంగా 96 శాతం ఎగబాకగా.. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 90 శాతం పెరిగాయి. ఫలితంగా గతేడాది 16.2 బిలియన్ డాలర్లు (రూ.1,19,006 కోట్లు)గా ఉన్న గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది 59 బిలియన్ డాలర్ల (రూ.4,33,450 కోట్ల)కు వృద్ధి చెందింది. దీంతో ఈ ఏడాది ఆయన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కంటే ఎక్కువ సంపద ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు.
ఆ గ్రూపు కంపెనీల విలువ 7.84 లక్షల కోట్లు
భారత్లో టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించిన మూడో గ్రూపుగా గౌతమ్ అదానీ గ్రూపు ఆవిర్భవించింది. అదానీ గ్రూపునకు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల్లో నాలుగు కంపెనీల షేర్లు మంగళవారం ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగబాకడమే ఇందుకు కారణం. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అదానీ గ్రూపులోని ఆరు లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 106.8 బిలియన్ డాలర్ల (రూ.7.84 లక్షల కోట్ల)కు చేరినట్లు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.