న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 7: క్రమంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఒకవైపు కరోనా విజృంభిస్తుండటంతో ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతుండటంతో పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లిస్తుండటంతో వీటి ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం బుధవారం మరింత పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం బంగారం ధర రూ.590 పెరిగి రూ.45,770 పలికింది. అంతకుముందు ధర రూ.45,180గా ఉన్నది. పసిడితోపాటు వెండి మరింత పుంజుకున్నది. కిలో వెండి ధర రూ.690 అధికమై రూ.65,470గా నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగి రూ.46,530 పలుకగా, 22 క్యారెట్ల ధర రూ.42,650గా ఉన్నది. వెండి ఏకంగా రూ.1,200 అధికమై రూ.70,500గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయంగా త్వరలో పెళ్ళిళ్ళ సీజన్ కూడా ప్రారంభంకాబోతుండటంతో అమాంతంగా డిమాండ్ ఊపందుకున్నది. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ ఉగాది పండుగ తర్వాత తిరిగి పెళ్ళిళ్ళకు మంచి ముహుర్తాలు ఉండటంతో దేశవ్యాప్తంగా ఆభరణాల దుకాణాల వద్ద సందడి నెలకొన్నది.