న్యూఢిల్లీ, మార్చి 19: దేశీయ ఐటీ దిగ్గ జం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని విభాగాల్లోని ఉద్యోగుల వేతనాలను పెంచనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల వేతనాలను పెంచబోతున్నట్లు ప్రకటించిన తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. ఈ ప్రకటనతో టీసీఎస్లోని దాదాపు 4.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. తాజా నిర్ణయంతో దేశంలోని టీసీఎస్ ఉద్యోగుల వేతనాలు సగటున 12 నుంచి 14 శాతం వరకు పెరిగే అవకాశమున్నదని, విదేశాల్లో పనిచేస్తున్న (ఆఫ్షోర్) ఉద్యోగులకు ఈ పెంపు 6 నుంచి 7 శాతం మేరకు ఉండవచ్చని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు చెప్తున్నాయి. టీసీఎస్ ఉద్యోగుల వేతనాలు పెరగనుండటం ఆరు నెలల్లో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ సంస్థ గతేడాది అక్టోబర్లో ఉద్యోగుల వేతనాలను పెంచింది. కాగా, టీసీఎస్ తాజా నిర్ణయాన్ని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. నిబంధనలకు లోబడి ఏప్రిల్ 1 నుంచి అన్ని ప్రాంతాల్లోని ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలో కంపెనీని వినూత్న ఆలోచనలతో ముందుకు నడిపిన టీసీఎస్ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఉద్యోగుల పట్ల కంపెనీకి గల నిబద్ధతకు వేతనాల పెంపు నిర్ణయమే నిదర్శనమని చెప్పారు. కొవిడ్-19 సంక్షోభ సమయంలో టీసీఎస్ క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడం కంపెనీకి ఎంతో కలిసొచ్చింది. దీంతో 2020 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం 7.2 శాతం పెరిగి రూ.8,701 కోట్లకు వృద్ధి చెందింది.
టాటా కమ్యూనికేషన్స్కు కేంద్రం టాటా
10% వాటా పాన్టోన్ ఫిన్వెస్ట్కు విక్రయం
టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వం నిష్క్రమించింది. ఆ సంస్థలో 10 శాతం వాటాను టాటా సన్స్ అనుబంధ సంస్థ పానాటోన్ ఫిన్వెస్ట్కు విక్రయించినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. టాటా కమ్యూనికేషన్లో మొత్తంగా కేంద్రానికి 26.12 శాతం, పాన్టోన్ ఫిన్వెస్ట్కు 34.80 శాతం, టాటా సన్స్కు 14.07 శాతం, పబ్లిక్ ఇన్వెస్టర్ల చేతిలో 25.01 శాతం వాటా ఉండేది. కానీ ప్రభుత్వం ఇప్పటికే 16.12 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ మార్గం ద్వారా రిటైల్, నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయించింది. మిగిలిన 10 శాతం వాటాకు సమానమైన 2.85 కోట్ల షేర్లను ఈ నెల 18న ఆఫ్ మార్కెట్ ట్రేడ్ మార్గం ద్వారా పాన్టోన్ ఫిన్వెస్ట్కు అమ్మినట్లు రాష్ట్రపతి తరఫున టెలికం విభాగం రెగ్యులేటరీ నోట్లో స్పష్టం చేసింది. దీంతో టాటా కమ్యూనికేషన్స్ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలిగినట్లయింది.