జనవరి కంటే ఫిబ్రవరిలో తగ్గుదల
న్యూఢిల్లీ, మార్చి 1: తాజాగా ముగిసిన ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు అంతక్రితం నెలకంటే మందగించాయి. 2022 ఫిబ్రవరిలో ఈ వసూళ్లు రూ.1.33 లక్షల కోట్లుకాగా, ఈ ఏడాది తొలి న్లైన జనవరిలో రూ.1.41 లక్షల కోట్లు. అయితే 2021 ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో మాత్రం వసూళ్లు 18 శాతం వృద్ధిచెందాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గూడ్స్, సర్వీసుల పన్ను (జీఎస్టీ) నెలవారీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్ల స్థాయిని దాటడం ఇది ఐదవసారి. అలాగే తొలిసారిగా సెస్ వసూళ్లు రూ.10,000 కోట్ల స్థాయిని మించాయని, కీలక రంగాలు కోలుకుంటున్నాయనడానికి ఇది సంకేతమని మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ముఖ్యంగా ఆటోమొబైల్ అమ్మకాలు పెరగడంతో సెస్ వసూళ్లు జోరందుకున్నాయన్నది. 2022 ఫిబ్రవరిలో వసూలైన రూ1,33,026 కోట్ల జీఎస్టీ ఆదాయంలో సెంట్రల్ జీఎస్టీ రూ.24,435 కోట్లుకాగా, స్టేట్ జీఎస్టీ రూ.30,779 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.67,471 కోట్లు ఉన్నట్టు ఆర్థిక శాఖ వివరించింది. ఫిబ్రవరి..28 రోజులతో కూడిన నెల అయినందున, సాధారణంగా ఆదాయం జనవరికంటే తక్కువే ఉంటుందని, పాక్షికంగా లాక్డౌన్లు, వారాంతపు, రాత్రి కర్ఫ్యూలు, వివిధ రాష్ర్టాల్లో ఒమిక్రాన్ నియంత్రణలు ఉన్నా, వసూళ్లలో వృద్ధిచెందటం గమనార్హమని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది.