న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఆదాయపు పన్ను రిటర్న్లు సమర్పించే కొత్త పోర్టల్లో సాంకేతిక సమస్యలు చాలావరకూ తొలగిపోయాయని బుధవారం ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ 7వరకూ 1.19 రిటర్నులు దాఖలయ్యాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇప్పటివరకూ 8.83 కోట్లమంది కొత్త పోర్టల్లో లాగిన్ అయ్యారని, సెప్టెంబర్ నెలలో రోజుకు సగటున 15.55 లక్షల మంది లాగిన్ అయినట్లు ప్రకటన వివరించింది. ఇదే నెలలో రోజుకు సగటున 3.2 లక్షల మంది రిటర్న్లు ఫైల్ చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది. ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్ జూన్ 7న ప్రారంభమైనప్పటికీ, పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు పన్ను చెల్లింపుదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ పోర్టల్ను అభివృద్ధిచేసిన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్తో ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడంతో చాలావరకూ సమస్యలు పరిష్కారమయ్యాయని సీబీడీటీ తెలిపింది.
95 లక్షల ఐటీఆర్లు ఈ-వెరిఫైడ్…
ఇప్పటివరకూ ఈ పోర్టల్ ద్వారా 95 లక్షల ఐటీఆర్లను ఈ-వెరిఫై చేయడం జరిగిందని, ఇందులో 7 లక్షల రిటర్న్లను ప్రాసెస్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఫేస్లెస్ అసెస్మెంట్/అప్పీళ్ళు/పెనాల్టీల కింద జారీచేసిన 8.74 లక్షల నోటీసుల్ని పన్ను చెల్లింపుదారులు పోర్టల్లో చూడగలుగుతారని సీబీడీటీ వివరించింది. ఆధార్-పాన్ను 66.44 లక్షలమంది కొత్త పోర్టల్ ద్వారా లింక్ చేశారని, 14.59 లక్షల ఈ-పాన్లను జారీచేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పోర్టల్ సమస్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్…ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పారేఖ్ను పిలిపించి, సెప్టెంబర్ 15లోగా వీటిని పరిష్కరించాలంటూ గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ పోర్టల్ కోసం ప్రభు త్వం ఇప్పటివరకూ ఇన్ఫోసిస్కు రూ.164.5 కోట్లు చెల్లించింది.