బెంగళూరు: గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, వాల్మార్ట్ అనుబంధ ఫ్లిప్కార్ట్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును సవాల్ చేస్తూ ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ రెండు సంస్థలు యాంటీ కాంపిటిటివ్ పద్దతులకు పాల్పడుతున్నాయన్న వచ్చిన ఆరోపణలపై సీసీఐ దర్యాప్తు చేస్తున్నది.
ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్కు విచారణ యోగ్యత లేదని జస్టిస్లు సతీశ్ చంద్ర శర్మ, నటరాజ్ రంగస్వామిలతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సీసీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదని వెల్లడించింది.
కర్ణాటక హైకోర్టు తీర్పుపై అమెజాన్ ప్రతిస్పందిస్తూ తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. జడ్జిమెంట్ను సమీక్షించాలని సవివరంగా పిటిషన్ వేస్తామని ప్రకటించారు.
భారత చట్టాలను గౌరవిస్తాం.. ఫ్లిప్ కార్ట్
భారత చట్టాలను గౌరవిస్తామని ఫ్లిప్కార్ట్ వ్యాఖ్యానించింది. కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ప్రతి కోసం వేచి చూస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిది అన్నారు. భారత చట్టాలకు లోబడి వ్యవహరిస్తామన్నారు.