న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో పెద్ద ఎత్తున నియామకాల ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్తో సహా 35 నగరాల్లో ఈ ఏడాది 8,000కుపైగా ఉద్యోగుల్ని ప్రత్యక్షంగా నియమించనున్నట్లు అమెజాన్ హెచ్ఆర్ లీడర్ దీప్తివర్మ గురువారం చెప్పారు. కార్పొరేట్, టెక్నాలజీ, కస్టమర్ సర్వీసు, ఇతర నిర్వహణా విభాగాల్లో నియామకాలు ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గావ్, ముంబై, కొల్కతా, నోయిడా, అమృత్సర్, అహ్మదాబాద్, భోపాల్, కోయింబత్తూరు, జైపూర్, కాన్పూర్, లూధియానా, పూణే, సూరత్ తదితర నగరాల్లో ఈ నియామకాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు.మెషిన్ లెర్నింగ్, అప్లయిడ్ సైన్సెస్ విభాగం కోసం కొత్తగా ఉద్యోగుల్ని తీసుకుంటున్నామని, హెచ్ఆర్, ఫైనాన్స్, లీగల్ తదితర కార్యకలాపాల కోసం కూడా నియామకాలు జరుగుతాయని దీప్తి తెలిపారు. 2025కల్లా 20 లక్షల ఉద్యోగుల్ని నియమించుకోవాలని భావిస్తున్నామని ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా అమెజాన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి కల్పించిందని ఆమె వివరించారు. ఈ నియామక ప్రక్రియ అంతా వర్చువల్గా జరిగిందన్నారు.
సెప్టెంబర్ 16న కెరీర్ డే…
అమెజాన్ తొలిసారిగా ఇండియాలో సెప్టెంబర్ 16న కెరీర్ డేను నిర్వహిస్తున్నట్లు దీప్తి వెల్లడించారు. వర్చువల్గా, ఇంటరాక్టివ్గా సాగే ఈ కార్యక్రమంలో అమెజాన్ లీడర్షిప్, ఉద్యోగులు పాల్గొని అమెజాన్లో వారి పని అనుభవాల్సి వివరిస్తారని ఆమె తెలిపారు. ‘ఇక్కడ (అమెజాన్లో) పనిచేయడం ఎలా ఉంది?… అమెజాన్ మంచి వర్క్ప్లేస్గా రూపొందడానికి కారణాలేమిటి?’ అనే అంశాలపై మాట్లాడతారని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉద్యోగార్థుల కోసం 2000 ఉచిత కోచింగ్ సెషన్లు (ఒన్-ఆన్-ఒన్గా) నిర్వహిస్తామని చెప్పారు. 140 మంది అమెజాన్ రిక్రూటర్స్ ఈ కోచింగ్ సెషన్లలో పాల్గొంటారని దీప్తి తెలిపారు. ఉద్యోగ అన్వేషణ కోసం అనుసరించాల్సిన ప్రక్రియ, నైపుణాల్ని పెంపొందించుకోవడం, ఇంటర్వ్యూ టిప్స్ ఈ సెషన్లలో లభిస్తాయని ఆమె వివరించారు.