హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం రికార్డుస్థాయిలో 1.30 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 6,542 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 20 మంది ప్రాణాలుకోల్పోయినట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 898 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 46,488 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 86.85 శాతానికి తగ్గగా, జాతీయ సగటు 85 శాతానికి పడిపోయింది.
మళ్లీ మొదలైన వ్యాక్సినేషన్
టీకాల కొరతతో రెండు రోజులపాటు నిలిచిపోయిన వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభం అయ్యింది. మంగళవారం 1.39 లక్షల మందికి టీకాలు వేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇందులో 1.20 లక్షల మందికి మొదటి డోస్ ఇవ్వగా, 18,468 మందికి రెండోడోస్ వేశారు. ఇప్పటివరకు 32.68 లక్షల మందికి టీకాలు వేసినట్టు వెల్లడించింది.