కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం/ కూసుమంచి/ కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 28: గులాబ్ తుఫాన్ కారణంగా రైతులకు పంట నష్టం జరిగింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగుల్లోకి చేరిన వరదనీరు పంటలకు నష్టం కలిగించింది. దీంతో అశ్వారావుపేట, గుండాల, ఆళ్లపల్లి, బూర్గంపహాడ్ మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. ఇంకా చాలా గ్రామాల్లో వరదనీరు పంట పొలాల్లోకి చేరినప్పటికీ రైతులు అప్రమత్తమై నీటిని తొలగించడంతో ముప్పు తప్పింది. అశ్వారావుపేటలో వరి 70 ఎకరాలు, వేరుశనగ 30 ఎకరాలు, ఆళ్లపల్లి మండలంలో వరి 42 ఎకరాలు, గుండాలలో వరి 15 ఎకరాలు, పత్తి 15 ఎకరాలు, మొక్కజొన్న 25 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. మొత్తం 14 గ్రామాల్లో 50 మంది రైతులకు సంబంధించిన 197 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. మరికొన్ని గ్రామాల్లో వరి మడుల్లో నీరు చేరడంతో రైతులు ఆ నీటిని తొలగించారు. మరికొన్ని ప్రాంతాల్లో పత్తి చెట్లు నేలకొరిగాయి. మారుమూల గ్రామాల్లో వాగులు అడ్డంకిగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని పంట నష్టం వివరాలనూ వ్యవసాయ అధికారులు ఇంకా అంచనా వేస్తున్నట్లు డీఏవో కొర్సా అభిమన్యుడు తెలిపారు.
ఖమ్మంలో 600 ఎకరాల్లో..
ఖమ్మం జిల్లాలోని 600 ఎకరాల్లో మిర్చి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారి జీ.అనసూయ తెలిపారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. 417 మంది రైతులకు సంబంధించిన 600 ఎకరాల విస్తీర్ణంలో తోటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో 115 మంది రైతులకు చెందిన 170 ఎకరాలు, వైరా నియోజకవర్గంలో 135 మంది రైతులకు చెందిన 160 ఎకరాలు, పాలేరు నియోజకవర్గంలో 152 మంది రైతులకు చెందిన 230 ఎకరాల్లో తోటలకు నష్టం వాటిల్లింది. సత్తుపల్లి నియోజకవర్గంలో 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాల్లో మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. కూసుమంచి మండలంలోనూ వరి, మిర్చి, పత్తి పంటలు వరద నీటిలో మునిగాయి. కూసుమంచి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద నుంచి వచ్చిన వరద పొలాలపై పడడంతో శివాలయం వెనుక ఉన్న సుమారు 50 ఎకరాల్లో పొలాలు నీటిలో మునిగిపోయాయి. కాగా, గంగదేవిచెరువు అలుగు పెరగడంతో కిష్టాపురం – కూసుమంచి మధ్య రాత్రి వేళల్లో రాకపోకలను అధికారులు నిషేధించారు. అదేవిధంగా మరికొన్ని గ్రామాలకు కూడా రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తహసీల్దార్ శిరీష తెలిపారు. నర్సిహులగూడెం – కొత్తూరు, కిష్టాపురం – సీతారామపురం, చౌటపల్లి – బీరోలు రహదారులపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
ఒకే నెలలో రెండోసారి..
కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 28: ఈనెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు అప్పట్లోనే పొలాలు మునిగాయి. తాజాగా రెండోసారి వచ్చిన వరదల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, చేతికొచ్చే అవకాశం లేదని కూసుమంచి రూరల్ మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సుమారు 45 చెరువులు అలుగు పోస్తున్నందున నీటి ఉధృతికి పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1200 ఎకరాల్లో పంట మునిగినట్లు సమాచారం. నష్టం వివరాలు అంచనా వేసి బుధవారం నాటికి అధికారులకు నివేదిక అందజేస్తామని మండల వ్యవశాఖ అధికారి ఆర్.వాణి తెలిపారు.