తిరుపతి : తాళ్ళపాక అన్నమాచార్యులవారు శ్రీ వేంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ రచించిన 32 వేల సంకీర్తనల్లో 14 వేల సంకీర్తనలు మాత్రమే వెలుగుచూశాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీటంన్నింటినీ స్వర పరచి ప్రజా బాహుళ్యంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మిగిలిన సంకీర్తనలను కూడా వెలికి తీసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అన్నమాచార్య సంకీర్తనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎస్వీబీసీ ద్వారా టీటీడీ రూపకల్పన చేసిన అదివో అల్లదివో కార్యక్రమ విజయోత్సవ సభ బుధవారం రాత్రి మహతి ఆడిటోరియంలో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
15 – 25 ఏండ్ల వయస్సున్న యువతీ యువకులు అన్నమయ్య సంకీర్తనలను పోటీపడి ఆలపించడం సంతోషదాయకమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నేటి తరాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం సంతోషదాయకమన్నారు. అన్నమాచార్య సంకీర్తనలలోని సంగీత, సాహిత్య, భక్తి అంశాలలోని మాధుర్యాన్ని ఇవాల్టి యువతీ, యువకులకు అందించేందుకు ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. అన్నమాచార్య సంకీర్తనలకు అర్థతాత్పర్యాలపై లోతైన విశ్లేషణ చేసి భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కృషి జరుగుతున్నదని చెప్పారు.
ఆ అదృష్టం ఘంటసాలదే : శ్రీమతి సుశీల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో కూర్చుని ఆయనపై పాట పాడే అదృష్టం ఘంటసాలకు మాత్రమే దక్కిందని ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ శ్రీమతి పీ సుశీల చెప్పారు. ప్రపంచమే హద్దుగా ఎస్వీబీసీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతుండటం అభినందనీయమన్నారు. దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎందరో నూతన గాయకులను వెలుగులోకి తెచ్చారని, అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని చెప్పారు. స్వామి వారి నామ సంకీర్తన పలకడం తన పూర్వ జన్మ సుకృతమని శ్రీమతి సుశీల చెప్పారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ శ్రీమతి సుధా రఘునాథన్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు విద్యాసాగర్, సినీ నేపథ్య గాయని శ్రీమతి ఎస్పీ శైలజ, ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచేంద్ర, టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, జేఈఓ శ్రీమతి సదా భార్గవి, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, శ్రీమతి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎస్వీబీసీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు.
విజేతలకు బహుమతి ప్రధానం
మొత్తం 35 ఎపిసోడ్లతో రూపొందించిన అదివో అల్లదివో కార్యక్రమంలో 138 మంది గాయనీ గాయకులు పాల్గొనగా.. తొమ్మిది మంది ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. మొదటి స్థానంలో కుమారి ఆశ్రిత, రెండవ స్థానంలో కుమారి శ్రీ ధృతి, మూడో స్థానంలో చిరంజీవి కార్తికేయ నిలిచారు. వీరికి నగదు బహుమతితో పాటు స్వామివారి చిత్ర పటాలు సర్టిఫికెట్ అందించి శాలువాతో సత్కరించారు. రన్నరప్ గా కుమారి మోనీషా, కుమారి అనూష, కుమారి శ్రీశృతి, కుమారి లక్ష్మీ శైలజ, కుమారి శ్రీవైష్ణవి దేవి, కుమారి నమ్రత నిలిచారు.