అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ నాయకులు అనేక అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మంగళగిరి, పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం నాటి నుంచి నేడు కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ వరకు వైసీపీ అక్రమాలను చూసి అందరూ ముక్కనవేలేసుకుంటున్నారని ఆరోపించారు . ఇతర పార్టీలకు చెందిన వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.
ఇంతటి అక్రమాలు తన 40ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే టీడీపీ కార్యకర్తలు నిలదీస్తూ అడ్డుకుంటున్నారని, ఇక్కడ కూడా చట్టాలను పోలీసులు గాలికి వదిలేసి అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు.
వైఎస్సార్సీపీపై అనేకమార్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అసలు రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా..?అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని గుర్తించి చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదన్నారు. సోమవారం పోలింగ్ రోజున టీడీపీ ఏజెంట్లను అరెస్ట్ చేశారని, ఎన్నికల రోజు ఎజెంట్లను ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు అన్నారు.