AP News | వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా మంగళగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న పోరు.. ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంపై ఏర్పడిన ఉత్కంఠపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి గంజి శ్రీనివాస్ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
ఏపీని మోసం చేసిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ఎప్పుడో చచ్చిపోయిందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ నెల 31వ తేదీన మంగళగిరిలో సాధికార బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధినేత జగన్.. అక్కడ ఎలాగైనా తమ పార్టీ గెలవాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చిత్తుగా ఓడించారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడారు. వైఎస్ షర్మిల వెంట కాంగ్రెస్లో చేరారు. దీంతో మంగళగిరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డిని రంగంలోకి దించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి ఎన్నికల ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డిని రంగంలోకి దించనున్నట్లు సమాచారం.