అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం ఇక్కడ 50 విడిజన్లు 47 స్థానాల్లో (ఏకగ్రీవంతో కలిపి) వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఎన్నికలకు ముందే 3 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజన్లకే ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఆది నుంచి అధికార పార్టీ హవా కొనసాగుతూ వచ్చింది. 28, 37, 47 డివిజన్లలో మినహా మిగిలిన అన్నిస్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 50వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ నూర్జహాన్ బేగం ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యంతో ఆమె గెలుపొంది మరోసారి మేయర్ రేసులో నిలిచారు. మేయర్గా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమెనే ఎంపిక చేసినట్లు తెలిసింది. దీంతో నూర్జహాన్ మద్దతుదారులు ఆనందంలో సంబురాలు చేసుకుంటున్నారు.