Badvel by election | బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ రికార్డు బద్దలు కొట్టారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మెజార్టీని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు. డాక్టర్ సుధాకు 90,228 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే.
గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో తన భర్త కంటే దాదాపు రెట్టింపు మెజారిటీని సాధించారు. దాసరి సుధకు మొత్తం 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 21,621 ఓట్లు, కాంగ్రెస్కు 6 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి దాసరి వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ అధిష్టానం.. బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా దాసరి సుధను ఎంపిక చేసింది.