YSR Congress Party | త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో మార్పులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తొమ్మిదో జాబితాను మీడియాకు రిలీజ్ చేసింది. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా.. పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి నియామకంతోపాటు మూడు స్థానాలకు ఇన్ చార్జీలను నియమించింది.
కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ సమన్వయకర్తగా రిటైర్ ఐఏఎస్ ఇంతియాజ్, మంగళగిరి ఇన్ చార్జీగా మురుగుడు లావణ్యను నియమించింది. గతంలో మంగళగిరికి గంజి చిరంజీవిని నియమించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మార్చేసింది. ఇటీవలే వీఆర్ఎస్ తీసుకున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇప్పటి వరకు తొమ్మిది జాబితాల్లో 74 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ‘మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి.. అందుకు ప్రయత్నిద్దాం.. ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండటానికి మార్పులూ చేర్పులు అవసరం. అందుకు మీరంతా సహకరించాలి.. భవిష్యత్లో మీకు తగిన గుర్తింపు ఇస్తాం’ అని తొలి నుంచి పార్టీ శ్రేణులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.