Mudragada | టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ అధికారంలోకి వస్తే, వచ్చేది రాక్షస రాజ్యం అని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. 2016లో ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం చూశానని పేర్కొన్నారు. కిర్లంపూడిని పాకిస్థాన్గా మార్చిన చంద్రబాబును వదిలేది లేదని తేల్చి చెప్పారు.
అధికారంలో కూర్చునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నాడని ముద్రగడ వ్యాఖ్యానించారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాలుగేండ్లు రావణ రాజ్యం చూశామని అన్నారు. చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించుకుపోతున్నదని, అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణ రాజ్యం చేస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయమై ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్లో దారుణ పాలన సాగించిన చంద్రబాబును వదిలి పెట్టే ప్రసక్తి లేదని ముద్రగడ తేల్చి చెప్పారు. భగవంతుడు వేసిన శిక్షను చంద్రబాబు ఇంకా అనుభవించాలని స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పేవాడికి లొంగిపోతే ఆక్సిజన్ దొరకదని తెలిపారు.
పేదల ఆక్సిజనే సీఎం వైఎస్ జగన్ అని ముద్రగడ గుర్తు చేశారు. ఆ ఆక్సిజన్ను కాపాడుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నానని చెప్పారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు పాలన మనకు అవసరమా? అని ప్రశ్నించారు.