ఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు న్యాయం జరుగడం లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీలో విచారణ జరిగితే తమకు న్యాయం అందదని, అందుకని మరో రాష్ట్రానికి కేసు విచారణను బదిలీ చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు. దాంతో ఏపీ సర్కార్తోపాటు సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను అక్టోబర్ 14 కు వాయిదా వేసింది.
తన తండ్రి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలాయించాలని కోరుతూ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ జరిపినట్లయితే తమ కుటుంబానికి న్యాయం జరుగదని తాము భావిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకని హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసి పర్యవేక్షించాలని ఆమె తన పిటిషన్లో కోరారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐతో పాటు ఏపీ సర్కార్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 14 కు వాయిదా వేసింది.
తన తండ్రి హత్య జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఎలాంటి పురోగతి కనిపించడంలేదని సునీతా రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులకు బెదిరింపులు కూడా వస్తున్నాయని, అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసును విచారించాలని ఆమె తన పిటిషన్లో కోరారు. 2019 మార్చి 14 న వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లో దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఇన్నేండ్లయినా కేసు విచారనలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వివేకా కుమార్తె సునీతరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.