అమరావతి : చంద్రబాబు ( Chandra Babu ) దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం పనితీరు ఉందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jagan Mohanreddy ) అన్నారు. హేరామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ ( Hey Ram..Save Andhra Pradesh ) అంటూ ట్విటర్ వేదిక ద్వారా చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డారు.
రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారని దుయ్యబట్టారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయినా ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదని, ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడం లోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్డెత్ చేసి శవాన్ని మాయం చేసిన పోలీసుల వైఖరినీ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవని విమర్శించారు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసు, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయని ఆరోపించారు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెడుతున్నారని ఆరోపించారు . యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, జర్నలిస్ట్ కేవీఆర్, మరో యూట్యూబర్ రావణ్ విషయంలో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపి కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబని అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలని చంద్రబాబుకు సూచించారు.