అమరావతి : వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అల్లూరి జిల్లా గన్నవరం, తోటపల్లి, ఏటపాక మండలం నందిగామ పాడు గ్రామంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అసమర్ధత కారణంగా వాటిని సాధించలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని ఆరోపించారు.
గడిచిన మూడేండ్లలో రూ. 8 లక్షల అప్పు చేసిన జగన్ పోలవరం బాధితులకు ఇవ్వాల్సిన రూ. 20 వేల కోట్ల కోసం ఆలోచించడం దుర్మార్గమని ఆరోపించారు. పోలవరం పూర్తి చేయటం చేతకాకపోతే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజాయితీ, విశ్వాసనీయత లేని నేతలతో రాష్ట్రానికే ప్రమాదమని ఆయన అన్నారు. బాధితులను రోడ్డు మార్గాన వెళ్లి పరామర్శించలేని సీఎం ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు.
హుద్ హుద్ తుపాను సమయంలో గత ప్రభుత్వం పరిహారం పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9ను ఈ ప్రభుత్వం వరద బాధితులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు.