అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఏపీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,56,256 కోట్ల బడ్జెట్ను మంత్రి అసెంబ్లీ ముందుంచారు. మంత్రి బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా.. టీడీపీకి చెందిన సభ్యలు పలుమార్లు అడ్డుకున్నారు. స్పీకర్ ఎంతగా వారిస్తున్నా వినకుండా సభలో నినాదాలు చేయడంతో తమ్మినేని సీతారాంకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో టీడీపీ సభ్యులను ఉద్దేశించి తమ్మినేని ఘాటుగా కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని టీడీపీ సభ్యులను హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టగానే టీడీపీ సభ్యుల అరుపులు, కేకలు మొదలయ్యాయి. వివిధ పథకాలకు కేటాయించిన మొత్తాలను వివరించి చెప్తుండగా.. టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్థిక మంత్రి చెప్తున్న లెక్కలన్నీ అవాస్తవాలేనంటూ కామెంట్స్ చేస్తూ తరచూ బుగ్గన ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. దాంతో స్పీకర్ తమ్మినేని సీతారాంకు చిర్రెత్తుకొచ్చి.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సభ్యులు వ్యవహరించే తీరు ఇది కాదంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది. టీడీపీ సభ్యులకు బడ్జెట్ ప్రసంగాన్ని వినడం ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సూచించారు.
మంత్రి బడ్జెట్ ప్రసంగంలో అవాస్తవాలు ఉన్నట్లయితే బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడాలని టీడీపీ సభ్యులకు స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. అలాకాకుండా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించడం కుదరదని సీరియస్గా చెప్పారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమీ బాగో లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కొంత గందరగోళం నెలకొన్నది. ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ హెచ్చరించారు.